బిల్గేట్స్ను దాటేశాడు: శ్రీమంతుల్లో టాప్ అమెజాన్ బెజోస్.. ఇండియా నుంచి ముఖేశ్ ఒక్కరే
న్యూయార్క్: ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడి జాబితాలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ వెనుకపడ్డారు. గత 24 ఏళ్లలో 18 ఏళ్ల పాటు అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ బిల్గేట్స్ ఈ ఏడాది రెండో స్థానంలో ఉన్నారు. అత్యంత సంపన్నుడి జాబితాలో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ నిలిచారని ఫోర్బ్స్ మ్యాగజైన్ మంగళవారం తెలిపింది. జెఫ్ బెజోస్ ఫోర్బ్స్ శ్రీమంతుల వార్షిక జాబితాలో మొదటి స్థానాన్ని సాధించడం ఇదే మొదటిసారి. ఏడాది కాలంలో అమెజాన్ షేర్లు 59 శాతం పెరగడంతో జెఫ్ బెజోస్ సంపద ఈ ఏడాది దాదాపు రెట్టింపై 11,200 కోట్ల డాలర్లకు పెరిగింది.
ఇక రెండో స్థానంలో ఉన్న బిల్గేట్స్ సంపద 9,000 కోట్ల డాలర్లుగా ఉంది. ఇక మూడో స్థానంలో 8,400 కోట్ల డాలర్లతో లెజండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ నిలిచారు. 7,200 కోట్ల డాలర్లతో ఫ్రెంచ్ పారిశ్రామికవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ నాలుగో స్థానంలో, 7,100 కోట్ల డాలర్లతో ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్ ఐదో స్థానంలో ఉన్నారు.

ముకేశ్ అంబానీకి 19వ స్థానం
ఇక భారత్ విషయానికొస్తే, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో మొత్తం 119 మంది భారతీయులకు చోటు దక్కింది. వీరిలో 18 మంది కొత్తగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అత్యంత సంపన్న భారతీయుడైన రిలయన్స్ అధినేత ముకేశ్అంబానీ ఈ ప్రపంచ సంపన్నుల జాబితాలో 19 వస్థానంలో ఉన్నారు. ఆయన సంపద 4,010 కోట్ల డాలర్లు (దాదాపు రూ.2.61 లక్షల కోట్లు) అన్నమాట.

ఆర్సెలర్ లక్ష్మీ మిట్టల్కు 62వ స్థానం
భారత్ శ్రీమంతుల జాబితాలో 58వ స్థానంలో విప్రో అజిమ్ ప్రేమ్జీ (1,880 కోట్ల డాలర్లు), 62వ స్థానంలో ఆర్సెలర్ లక్ష్మీ మిట్టల్ (1,850 కోట్ల డాలర్లు), 98వ స్థానంలో శివ్ నాడార్ (1,460 కోట్ల డాలర్లు) ఉన్నారు. ఇక సన్ ఫార్మా అధినేత దిలిప్ సంఘ్వి 1,280 కోట్ల డాలర్ల సంపదతో 115వ స్థానంలో ఉన్నారు. రామ్దేవ్ అగర్వాల్, తరంగ్ జైన్, నిర్మల్ మిందా, రవీంద్ర కిశోర్ సిన్హాలు ఒక్కొక్కరు వంద కోట్ల డాలర్ల సంపదతో ఈ జాబితాకెక్కారు.

అరబిందో ఫార్మా, దివిస్ కూ ఫోర్బ్స్ లో చోటు
ఈ జాబితాలో జిందాల్ స్టీల్ అండ్ పవర్ సంస్థకు చెందిన సావిత్రి జిందాల్ 176 స్థానంలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ఫార్మా దిగ్గజాలకు కూడా ఈ జాబితాలో స్థానం లభించింది. అరబిందో ఫార్మా రామ్ ప్రసాద్ రెడ్డి 250 కోట్ల డాలర్ల సంపదతో 965వ ర్యాంక్ను, దివీస్ మురళి 230 కోట్ల డాలర్లతో 1,070వ ర్యాంక్ను సాధించారు.

2208 మంది శ్రీమంతులకు చోటు కల్పించిన ఫోర్బ్స్
వందకోట్ల డాలర్లు (దాదాపు రూ.6,500 కోట్లు) పైబడిన ప్రపంచ వ్యాప్త సంపన్నులతో ఫోర్బ్స్ పత్రిక ఈ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో మొత్తం 2,208 మంది సంపన్నులకు చోటు దక్కింది. ఈ ఏడాది ఫిబ్రవరి 9 తర్వాతి షేర్ల ధరలను పరిగణనలోకి తీసుకొని ఈ జాబితాను రూపొందించారు. గత ఏడాది బిలియనీర్ల జాబితాలో స్థానం పొంది, ఈ ఏడాది ఈ జాబితా నుంచి జారిపోయిన వాళ్ల జాబితాలో పీఎన్బీ స్కామ్ సూత్రధారి నీరవ్ మోదీ ఉండడం విశేషం. గత ఏడాది 7.7 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న బిలియనీర్ల సంపద ఈ ఏడాది 9.1 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. ఒక్కో బిలియనీర్ సగటు సంపద 4.1 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది.

400 మంది టాప్ అమెరికన్ల జాబితాలో ట్రంప్ మిస్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంపదలో భారీగా కిందికి పడిపోయారు. అధ్యక్షపదవిని చేపట్టిన ఏడాది తరువాత ట్రంప్ సంపద 400 మిలియన్ డాలర్ల కిందికి పడిపోయింది. ఫోర్బ్స్ తాజాగా ప్రకటించిన ప్రపంచ శ్రీమంతుల జాబితాలో ట్రంప్ ఆస్తి 3.1బిలియన్ డాలర్లు అని పేర్కొంది ఫోర్బ్స్. అంతేకాదు గత ఏడాది అక్టోబర్లో ఫోర్బ్స్ విడుదల చేసిన అత్యంత ధనవంతులైన 400 అమెరికన్ల జాబితాలో నిలిచిన ట్రంప్ పేరు ఈ సారి మిస్ అయింది.

41 మిలియన్ల డాలర్లు తగ్గిన ట్రంప్ సంపద
ట్రంప్ సంపద తగ్గుదలకు అమెరికా మార్కెట్ల ప్రభావం పాక్షికంగా ప్రభావం చూపించగా న్యూయార్క్ నగరంలో రిటైల్ రియల్ ఎస్టేట్ సంక్షోభం ఆయన సంపదను దెబ్బతీసిందని నిపుణులు పేర్కొన్నారు. పుంజుకున్న ఇ-కామర్స్ బిజినెస్ ట్రంప్ టవర్ విలువను తగ్గించింది. ట్రంప్ విలువైన భవనం విలువ గత సంవత్సరంలో 41 మిలియన్ డాలర్లు తగ్గిందని ఫోర్బ్స్ అంచనా వేసింది. ఈ మార్కెట్ సవాళ్లకు తోడు దీర్ఘకాలం అద్దెదారుగా ఉన్న నైక్ సుమారు 65వేల చదరపు అడుగుల భవనాన్ని ఖాళీ చేయనున్నట్టు ప్రకటించింది. ఇది కూడా భారీ ప్రభావాన్నిచూపినట్టు తెలుస్తోంది.

2018లో స్వీయాభివ్రుద్ధి సాధించిన శ్రీమంతులు 67 శాతం
2018 సంవత్సరానికి ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ అత్యంత శ్రీమంతుల జాబితా గొప్ప ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ ఏడాది 255 మంది మహిళలు ఉన్నారని ఫోర్బ్స్ అసిస్టెంట్ మేనేజింగ్ ఎడిటర్ లూయిసా క్రోల్ ప్రకటించారు. రికార్డు స్థాయిలో 255 మంది మహిళలు ఈ సంవత్సరం కొత్తగా ర్యాంకింగ్లో చేరారని తెలిపారు. 2018 జాబితాలో 67 శాతం సెల్ప్ మేడ్ బిలియనీర్లుగా ఉన్నారని చెప్పారు. ముఖ్యంగా చైనాకు చెందిన మహిళా వ్యాపారవేత్త సెల్ఫ్ మేడ్ బిలియనీర్ లిస్ట్లో టాప్లో నిలిచారు. ఇది చాలా ఉత్సాహకరమైన పరిణామమని క్రోల్ సంతోషం వ్యక్తం చేశారు.

లెన్స్ టెక్నాలజీ ఫౌండర్ జౌ క్యున్ ఫియా టాపర్
కొత్తగా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న 255 మందిలో 72మంది మహిళలు తమకు తాముగా రాణించిన వ్యాపారవేత్తలుగా నిలిచారు. చైనీస్ వ్యాపారవేత్త, లెన్స్ టెక్నాలజీ వ్యవస్థాపకురాలు, సీఈవో జౌ క్యున్ఫియా (48) నికర సంపద 7.8 బిలియన్ డాలర్లతో జాబితాలో ధనవంతురాలైన మహిళగా ఉన్నారు. బాల్యంలోనే తల్లిని కోల్పోయిన జౌ చదువుకు స్వస్తి చెప్పారు. 16 ఏళ్లవరకు ఒక ఫ్యాక్టరీలో కార్మికురాలిగా పనిచేశారు. తర్వాత స్మార్ట్ఫోన్లలో వాడే టచ్ స్క్రీన్ తయారీ సంస్థను స్థాపించారని క్రోల్ వివరించారు.

టాప్ 20లో ఇద్దరు చైనా శ్రీమంతులకు చోటు
ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ సంపన్నుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు. ఇద్దరు చైనా శ్రీమంతులు టాప్ - 20 జాబితాలో చోటు దక్కించుకున్నారు. వారిలో చైనీస్ ఇంటర్నెట్ జెయింట్ టెన్సెంట్ సీఈఓ మా హౌటెంగ్.. ఆసియా ఖండంలో అత్యంత సంపన్నుడు. ప్రపంచ సంపన్నులో 17వ వ్యక్తి. తర్వాతీ స్థానంలో అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా ఉన్నారు. అమెరికా నుంచి 585 మంది, చైనా నుంచి 373 మందికి చోటు దక్కింది. ఈ దఫా క్రిప్టో కరెన్సీ బిలియనీర్లకు కూడా స్థానం లభించింది. పది మంది సౌదీ అరేబియన్లు ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించారు. రాజకీయ నాయకుల జాబితాలో 121 మంది పేర్లు తగ్గాయి.












Click it and Unblock the Notifications