LPG: ఆగస్టు 15 నాటికి కొత్త గ్యాస్ సిలిండర్లు! 100 నగరాలకు భారత్ పెట్రోలియం..
ప్రముఖ ప్రభుత్వ రంగ చమురు సంస్థ 'భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్' (BPCL) దేశంలో గ్యాస్ వినియోగదారులకు తీపి కబురు అందించింది. సాధారణ స్టీల్ సిలిండర్ల మోత భారాన్ని తగ్గించేలా రూపొందించిన 10 కేజీల తేలికపాటి 'కాంపోజిట్' ఎల్పీజీ సిలిండర్ల విక్రయాలను భారీగా విస్తరించాలని నిర్ణయించింది. ఆగస్టు 15 నాటికి దేశంలోని 24 రాష్ట్రాల్లో ఉన్న మరో 100 ప్రధాన నగరాలకు ఈ లైట్వెయిట్ సిలిండర్ల సేవలను అందుబాటులోకి తేనున్నట్లు కంపెనీ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది.

కొత్త కాంపోజిట్ సిలిండర్ల ప్రత్యేకత ఏంటి?
ప్రస్తుతం వాడుకలో ఉన్న 14.2 కేజీల ఇనుప సిలిండర్ల బరువు చాలా ఎక్కువ. అదే ఈ 10 కేజీల కాంపోజిట్ సిలిండర్ అయితే బరువు చాలా తక్కువగా ఉండటమే కాకుండా, చూడటానికి ఎంతో ఆధునికంగా ఉంటుంది. దీని బాడీ పారదర్శకంగా ఉండేలా రూపొందించడం వల్ల సిలిండర్లో గ్యాస్ ఎంత మిగిలి ఉందో బయటి నుంచే సులభంగా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇది తుప్పు పట్టదు, సురక్షితమైనది కూడా. చిన్న కుటుంబాలు, విద్యార్థులు, తరచూ ఇళ్లు మారే ఉద్యోగులకు ఈ సిలిండర్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.
కచ్చితమైన చమురు సరఫరా.. విదేశాల నుంచి దిగుమతులు
ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ పలు కీలక విషయాలను వెల్లడించింది. ముడి చమురు దిగుమతులకు సంబంధించి రష్యాపై మాత్రమే ఆధారపడకుండా వెనిజులా, అంగోలా వంటి దేశాల నుంచి కూడా కొనుగోళ్లను పెంచినట్లు తెలిపింది. ప్రస్తుతం కంపెనీ వద్ద దాదాపు 38 లక్షల టన్నుల ముడి చమురు నిల్వలు ఉన్నాయని, ఇవి రాబోయే 35 రోజుల అవసరాలకు సరిపోతాయని పేర్కొంది.












Click it and Unblock the Notifications