డబుల్ ధమాకా: ఇలా చేస్తే రూ.5 లక్షలు కాదు.. రూ.10లక్షల వరకు ఇన్కం ట్యాక్స్ ఉండదు!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ మధ్య వేతన జీవులకు, రైతులకు, సామాన్యులకు భారీ ఊరట కల్పించారు. సాధారణంగా ఎవరైనా ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. రాజకీయాల్లో ఇది సహజమే.
అయితే భావి భారత్ కోసం నాలుగేళ్ల పాటు మోడీ ప్రభుత్వం ఆచితూచి నిర్ణయాలు తీసుకుందని, ఇప్పుడు సరికొత్త భారత్ను నిర్మించేందుకు... మరోసారి అధికారంలోకి రావాలని, అందుకు అన్ని పార్టీల్లాగే వరాలు కురిపించక తప్పదన ఈ ప్రభుత్వం గుర్తించిందని అంటున్నారు.
మూడింట ఈ రెండు కీలక ప్రకటనలు
ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకు పీఎం కిసాన్ సమ్మన్ నిధి కింద రూ.6వేలు ఇస్తామని ప్రకటించారు. దీంతో 12 కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. అసంఘటిత కార్మికులు మన దేశంలో అధికం. వీరిలో చాలామంది అరవయ్యేళ్లు దాటినా ఇంకా చిన్నాచితకా పనులు చేస్తారు. వీరి కోసం మంచి పథకం తెచ్చింది. అరవైఏళ్లు నిండిన వారందరికీ ప్రతి నెల రూ.3వే పింఛన్ వచ్చే విధంగా రూపొందించారు. నెలసరి ఆదాయం రూ.15వేలు లోపు ఉండే వారు నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత రూ.3వేల పింఛన్ వస్తుంది. ఈ నిర్ణయంతో పది కోట్ల మంది ప్రయోజనం పొందుతారు.
రూ.5 లక్షల ఆదాయంపై మినహాయింపు
ఇక మరో కీలక ప్రకటన ఆదాయపన్ను పరిమితి మినహాయింపు. ఆదాయ పన్ను మినహాయింపు రూ.5 లక్షల వరకు ఇచ్చారు. ఇప్పటి వరకు ఉన్న శ్లాబ్ రేట్ ప్రకారం ఆదాయం రూ.2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలలోపు ఉంటే రూ.12,500 పన్ను విధించారు. ఇప్పుడు దానిని రెండింతలు చేసి వార్షికాదాయం ఉన్న వారికి భారీ ఊరటనిచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో రూ.5 లక్షలకు చేరింది. రూ.6.50 లక్షల వార్షిక ఆదాయం కలిగిన వారు మాత్రం పెట్టుబడులు పెట్టడం ద్వారా పన్ను మినహాయింపు సౌలభ్యాన్ని పొందవచ్చు. ఆ తర్వాత మిగిలిన మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది.
రూ.8 లక్షల నుంచి రూ.10లక్షల వరకు ట్యాక్స్ లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు
అంతేకాదు, సరైన ప్రణాళిక ఉంటే పెట్టుబడుల ద్వారా రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వార్షిక ఆదాయం కలిగిన వారు కూడా పూర్తి పన్ను మినహాయించవచ్చునని చెబుతున్నారు. రూ.5 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఇచ్చారు. రూ.5.50 లక్షల వరకు స్టాండర్డ్ డిడక్షన్ ఉంది. వీటికి తోడు సెక్షన్ 80 సీ కింద పీపీఎఫ్, ఈపీఎఫ్, పిల్లల ట్యూషన్, ఎస్పీఎఫ్లో పెట్టుబడి తదితర వాటితో మరో లక్షన్నర వరకు చూపించుకోవచ్చునని అంటున్నారు. ప్రీమియం హెల్త్ ఇన్సురెన్స్, సీనియర్ సిటిజన్స్, ఇంటి రుణం (రూ.2 లక్షలు).. ఇలా దాదాపు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం వచ్చినా ట్యాక్స్ లేకుండా చూసుకోవచ్చునని చెబుతున్నారు. ఇందుకు సరైన ప్రణాళిక ఉండాలని అంటున్నారు.
ఇలా ప్లాన్
ఉదాహరణకు రూ.10 లక్షలు వేతనం వస్తే.. సెక్షన్ 80సీ మినహాయింపు - రూ.1,50,000, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ - 2,00,000, ఎన్పీఎస్ - రూ.50,000, హెల్త్ ఇన్సురెన్స్, ప్రీమియమ్ పేమెంట్ రూ.50,000.. ఇలా ప్లాన్ చేసుకోవచ్చునని చెబుతున్నారు.