రేపు మందుల షాపులు బంద్..
దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఈ-ఫార్మసీలు, ఇన్స్టంట్ డెలివరీ యాప్ల అక్రమ కార్యకలాపాలు, ధరల దోపిడీ పద్ధతులకు నిరసనగా రేపు (మే 20న) దేశవ్యాప్త సమ్మెకు ఆల్-ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) పిలుపునిచ్చింది. దేశంలోని సుమారు 12.4 లక్షల మంది కెమిస్టులు, ఫార్మసిస్ట్లు, ఔషధ పంపిణీదారులు సభ్యులుగా ఉన్న ఈ అగ్రగామి సంస్థ, తగిన నియంత్రణ లోపాల వల్లే ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడింది. అయితే, రోగులకు అత్యవసర సేవల్లో అంతరాయం కలగకుండా చూసేందుకు అన్ని ప్రధాన ఫార్మసీ చైన్లు, ఆసుపత్రి మెడికల్ స్టోర్లు, ప్రభుత్వ జన ఔషధి కేంద్రాలు, అమృత్ (AMRIT) ఫార్మసీ అవుట్లెట్లు యథావిధిగా తెరిచే ఉంటాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఈ-ఫార్మసీల చట్టపరమైన అస్పష్టతకు కారణమవుతున్న ప్రభుత్వ నోటిఫికేషన్లు - G.S.R. 220(E), G.S.R. 817(E)లను తక్షణమే ఉపసంహరించుకోవాలని AIOCD ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. ఇందులో G.S.R. 817(E) అనేది ఎనిమిదేళ్ల క్రితం తెచ్చిన ముసాయిదా నోటిఫికేషన్ కాగా, ఇది ఇప్పటివరకు అధికారికంగా నోటిఫై కాలేదు, రద్దూ కాలేదు. మరోవైపు కోవిడ్-19 మహమ్మారి సమయంలో (మార్చి 26, 2020న) అత్యవసర చర్యగా తెచ్చిన G.S.R. 220(E) సడలింపులను ఆన్లైన్ సంస్థలు లొసుగుగా వాడుకుంటున్నాయని సంఘం విమర్శిస్తోంది. డ్రగ్ రూల్ 65 కింద ఉన్న రక్షణలను బలహీనపరుస్తూ, నియంత్రణ తనిఖీలను దాటవేయడానికి ఈ తాత్కాలిక నిబంధనలు దోహదపడుతున్నాయని, కాబట్టి వీటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది.

నకిలీ ప్రిస్క్రిప్షన్లు..
రోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించి AIOCD తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు భౌతిక ధృవీకరణ లేకుండా పాత ప్రిస్క్రిప్షన్లను ప్రమాదకరంగా పునర్వినియోగిస్తున్నాయని, నమోదుకాని వైద్యులు ఇచ్చే పత్రాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయని ఆరోపించింది. మరీ ముఖ్యంగా, కృత్రిమ మేధ (AI) ఆధారిత నకిలీ ప్రిస్క్రిప్షన్ల సృష్టి ద్వారా యాంటీబయాటిక్స్, అలవాటుగా మారే మందులు విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయని హెచ్చరించింది. ఇది సమాజంలో యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) ముప్పును పెంచుతోందని AIOCD ప్రధాన కార్యదర్శి రాజీవ్ సింఘాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ ఫార్మసీలను కూడా భౌతిక దుకాణాల మాదిరిగానే కఠినమైన నిబంధనలతో నియంత్రించాలని ఆయన స్పష్టం చేశారు.
సమతుల్యత దెబ్బతింటోంది..
వ్యాపార పరంగా పెద్ద కార్పొరేట్ సంస్థల మద్దతు గల ఈ-ఫార్మసీలు అందిస్తున్న 50 శాతానికి పైగా భారీ డిస్కౌంట్లు, ఆక్రమణ ధరల విధానం వల్ల మార్కెట్ సమతుల్యత దెబ్బతింటోందని కెమిస్టుల సంఘం వాదిస్తోంది. ప్రభుత్వ నిబంధనల (NPPA, DPCO) ప్రకారం అత్యవసర మందుల లాభాల మార్జిన్లు కఠినంగా నియంత్రించబడుతున్నప్పటికీ, కార్పొరేట్ సంస్థలు తమ లాభాలను వెచ్చించి ఇచ్చే అహేతుక తగ్గింపులతో చిన్న చిన్న భౌతిక ఫార్మసీలు పోటీ పడలేకపోతున్నాయని పేర్కొంది. ఈ అన్యాయమైన పోటీ విధానం వల్ల గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని చిన్న కెమిస్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారి, అంతిమంగా భారతదేశ సాంప్రదాయ ఔషధ సరఫరా నెట్వర్క్ కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
బంద్కు దూరంగా..
కాగా, సమ్మె ప్రభావంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నియంత్రణ సంస్థల అధికారులతో జరిగిన సమావేశంలో రిటైల్ ఫార్మసీల ఆందోళనలను పరిష్కరించడానికి తగిన చట్రాన్ని పరిశీలిస్తున్నామని హామీ లభించడంతో, ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా పలు రాష్ట్రాల సంఘాలు బంద్కు దూరంగా ఉంటున్నాయి. పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్ సహా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రిటైల్ ఫార్మసీ సంఘాలు తాము సమ్మెలో పాల్గొనబోమని స్వచ్ఛందంగా లిఖితపూర్వక హామీ ఇచ్చాయి.
అయితే, సమ్మె దేశవ్యాప్తంగా జరిగి తీరుతుందని జాతీయ సంఘం స్పష్టం చేయగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఈ సమస్య ప్రస్తుతం తమ పరిశీలనలో ఉందని తెలిపారు. సమ్మె జరిగే ప్రాంతాల్లో తాత్కాలిక అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున, క్రమం తప్పకుండా మందులు వాడే రోగులు ముందు జాగ్రత్తగా తగినన్ని నిల్వలను సిద్ధం చేసుకోవడం మంచిది.














Click it and Unblock the Notifications