EPFO సేవలకు మళ్లీ బ్రేక్.. రేపటి నుంచి ఏం జరుగబోతుంది?
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఆన్లైన్ సేవలను వాడుకునే వారికి బ్యాడ్ న్యూస్. సాంకేతిక కారణాల వల్ల గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన ఈపీఎఫ్ఓ ఆన్లైన్ సేవలు మరికొన్ని రోజులు అందుబాటులో ఉండవని సంస్థ ప్రకటించింది. సిస్టమ్ అప్గ్రేడేషన్ మరియు డేటాబేస్ మైగ్రేషన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో, ఈ సేవలను మరో మూడు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. తాజా సమాచారం ప్రకారం, జులై 2, 2026 అర్ధరాత్రి (12:00 గంటల) నుంచి మాత్రమే ఈ సేవలు మళ్లీ పునరుద్ధరించబడతాయి.
పొడిగించిన గడువు.. ఎందుకంటే?
నిజానికి, జూన్ 26న ప్రారంభమైన ఈ అప్గ్రేడ్ పనులు జూన్ 28తో ముగిసి, జూన్ 29 నుంచి సేవలు యథావిధిగా అందుతాయని ఈపీఎఫ్ఓ గతంలో ప్రకటించింది. కానీ, సాఫ్ట్వేర్ ఆధునీకరణ ప్రక్రియలో అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పడుతుండటంతో.. ఈ గడువును జులై 1వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు పొడిగించారు. ఇటీవలి కాలంలో ఈపీఎఫ్ఓలో ఇంత సుదీర్ఘ కాలం పాటు ఆన్లైన్ సేవలు నిలిచిపోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

నిలిచిపోయిన ముఖ్యమైన సేవలు ఇవే..
ఈ సుదీర్ఘ మెయింటెనెన్స్ వల్ల అటు ఉద్యోగులు (సబ్స్క్రైబర్లు), ఇటు కంపెనీల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం 'మెంబర్ పోర్టల్', 'ఎంప్లాయర్ పోర్టల్' రెండూ పూర్తిగా పని చేయడం లేదు.
ఉద్యోగులకు ఇబ్బందులు:
పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవడం (క్లెయిమ్స్), క్లెయిమ్ స్టేటస్ చెక్ చేసుకోవడం, ఆన్లైన్ పాస్బుక్ చూడటం, పీఎఫ్ ఖాతాను ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి బదిలీ చేయడం (ట్రాన్స్ఫర్), అలాగే వ్యక్తిగత వివరాలను అప్డేట్ చేసుకోవడం వంటి ఏ పనీ ఇప్పుడు కావడం లేదు.
కంపెనీలకు బ్రేక్:
ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్లకు సంబంధించిన నెలవారీ జమలు (సమ్మరీ ఫైలింగ్స్), ఇతర పరిపాలనా పరమైన పనులను నిర్వహించడానికి కంపెనీల యాజమాన్యాలకు వీలు పడటం లేదు.
ఈ అప్గ్రేడ్ వల్ల లాభం ఏంటి?
ప్రస్తుతం జరుగుతున్న టెక్నాలజీ అప్గ్రేడేషన్ వల్ల భవిష్యత్తులో యూజర్లకు ఎంతో మేలు జరుగుతుందని ఈపీఎఫ్ఓ పేర్కొంది. పాత క్లెయిమ్ ప్రాసెసింగ్ సిస్టమ్ను ఆధునీకరించడం వల్ల భవిష్యత్తులో పీఎఫ్ డబ్బుల విత్డ్రా ప్రక్రియ మరింత వేగంగా, సురక్షితంగా మారుతుందని తెలిపింది. ఈ సాంకేతిక మార్పుల వల్ల వెబ్సైట్ సర్వర్లు డౌన్ అయ్యే సమస్యలు కూడా తగ్గుతాయని స్పష్టం చేసింది.
జులై 2 నుంచి అన్నీ సజావుగా..
ఈ పొడిగింపు వల్ల చందాదారులకు జరుగుతున్న ఇబ్బందులకు ఈపీఎఫ్ఓ విచారం వ్యక్తంచేసింది. వినియోగదారులు సహకరించాలని కోరింది. జులై 2వ తేదీ నుంచి ఆన్లైన్ సేవలన్నీ యథావిధిగా అందుబాటులోకి వస్తాయని ధీమా వ్యక్తం చేసింది. ఈ లోగా ఏదైనా అత్యవసర సమాచారం లేదా సహాయం కావాలనుకునే వారు 14470 అనే ఈపీఎఫ్ఓ కాల్ సెంటర్ నంబర్ను సంప్రదించవచ్చని సూచించింది.














Click it and Unblock the Notifications