30 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గోల్డ్ ఇంపోర్ట్స్!
దాదాపు నెల రోజులుగా నిలిచిపోయిన బంగారం, వెండి దిగుమతులు మళ్లీ మొదలయ్యాయి. 3 శాతం ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (IGST) చెల్లింపు విషయంలో ప్రభుత్వానికి, బ్యాంకులకు మధ్య నలిగిన వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. సరఫరా సజావుగా సాగాలనే ఉద్దేశంతో బ్యాంకులు ఆ 3 శాతం పన్నును చెల్లించడానికి అంగీకరించడంతో విదేశీ బంగారం మళ్లీ భారత మార్కెట్లోకి అడుగుపెడుతోంది.
అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే?.. భారతదేశంలో 2017లో జీఎస్టీ విధానం వచ్చినప్పటి నుండి, బంగారం దిగుమతి చేసే బ్యాంకులకు 3 శాతం ఐజీఎస్టీ నుండి ప్రభుత్వం మినహాయింపునిస్తూ వస్తోంది. ఏటా ఈ మినహాయింపును ప్రభుత్వం పునరుద్ధరిస్తుంది. అయితే, 2026 ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైనప్పటికీ, ఈ మినహాయింపుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయలేదు. దీంతో కస్టమ్స్ అధికారులు పన్ను కట్టాల్సిందేనని పట్టుబట్టడం, బ్యాంకులు మినహాయింపు కోసం దిగుమతులు నిలిపివేయడంతో పెద్ద అంతరాయం ఏర్పడింది.

రూపాయిని కాపాడేందుకేనా?
ప్రభుత్వం ఉద్దేశపూర్వకగానే ఈ మినహాయింపును ఆలస్యం చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం రూపాయి విలువ పతనం కావడమే. 2025లో రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 5 శాతం తగ్గింది. 2026 జనవరి నుండి మరో 4.1 శాతం బలహీనపడింది. బంగారం కొనాలంటే డాలర్లు చెల్లించాలి, దీనివల్ల విదేశీ మారక నిల్వలు తగ్గి రూపాయిపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే బంగారం దిగుమతులు తగ్గించి వాణిజ్య లోటును అరికట్టాలని ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ కూడా దేశ ప్రయోజనాల దృష్ట్యా ఏడాది పాటు బంగారం కొనవద్దని ప్రజలను కోరడం విశేషం.
30 ఏళ్ల కనిష్టానికి దిగుమతులు
ఈ పన్ను వివాదం వల్ల ఏప్రిల్ 2026లో బంగారం దిగుమతులు కేవలం 15 మెట్రిక్ టన్నులకు పడిపోయాయి. కరోనా కాలం మినహాయిస్తే, గత 30 ఏళ్లలో ఇంత తక్కువ స్థాయిలో దిగుమతులు జరగడం ఇదే మొదటిసారి. సాధారణంగా నెలకు 60 మెట్రిక్ టన్నులు దిగుమతి అయ్యే చోట ఇంత పతనం కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్షయ తృతీయ వంటి పెద్ద పండుగ ఉన్నప్పటికీ, సరఫరా లేక బ్యాంకుల లాకర్లలోనే బంగారం ఉండిపోయింది.
మళ్లీ మొదలైన సరఫరా
ఇక లాభం లేదనుకున్న బ్యాంకులు, పన్ను కట్టి సరుకును విడిపించుకోవడం మొదలుపెట్టాయి. మే 2026లో ఇప్పటివరకు 9 మెట్రిక్ టన్నుల బంగారం, 34 మెట్రిక్ టన్నుల వెండిని బ్యాంకులు క్లియర్ చేశాయి. ఇదిలా ఉండగా, ప్రభుత్వం త్వరలోనే పాత మినహాయింపును పునరుద్ధరిస్తుందని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరో 48 నుండి 72 గంటల్లో సవరణ ఉత్తర్వులు రావచ్చని వారు భావిస్తున్నారు.
ప్రపంచ మార్కెట్పై ప్రభావం
ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా బంగారం కొనేది భారతీయులే. ఇప్పుడు భారత బ్యాంకులు మళ్లీ దిగుమతులు పెంచడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలకు మద్దతు లభించే అవకాశం ఉంది. అయితే, ఇండియాలో మాత్రం ప్రస్తుతం డిమాండ్ కాస్త నెమ్మదిగానే ఉంది. దీనివల్ల డీలర్లు అధికారిక ధర కంటే 17 డాలర్ల వరకు తక్కువకే (డిస్కౌంట్కు) బంగారాన్ని విక్రయిస్తున్నారు. బ్యాంకుల నుండి సరఫరా పెరగడంతో నగల వ్యాపారులు తమ నిల్వలను మళ్లీ పెంచుకునే పనిలో పడ్డారు.














Click it and Unblock the Notifications