Gold: లక్ష పెడితే రూ. 4.86 లక్షల లాభం.. గోల్డ్ బాండ్ల మ్యాజిక్!
స్థిరమైన రాబడి కోసం ఎదురుచూసే ఇన్వెస్టర్లకు 'సావరిన్ గోల్డ్ బాండ్లు' (Sovereign Gold Bond) కాసుల వర్షం కురిపించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా 2018-19 సిరీస్ I గోల్డ్ బాండ్ల తుది విమోచన (Redemption) ధరను ప్రకటించింది. ఈ బాండ్ ద్వారా ఇన్వెస్టర్లకు ఏకంగా 386 శాతం అద్భుతమైన రాబడి లభించింది. అంటే ఎనిమిదేళ్ల క్రితం ఎవరైతే లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టారో, వారికి ఇప్పుడు దాదాపు రూ. 4.86 లక్షలకు పైగా వెనక్కి రావడం విశేషం.
ఈ సిరీస్ బాండ్లు 2018 మే 4న జారీ కాగా, సరిగ్గా ఎనిమిదేళ్ల తర్వాత అంటే 2026 మే 4న ఇవి మెచ్యూరిటీ దశకు చేరుకున్నాయి. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) అందించిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 28, 29, 30 తేదీల్లో 999 స్వచ్ఛత గల బంగారం సగటు ధర ఆధారంగా విమోచన ధరను నిర్ణయించారు. దీని ప్రకారం, ఇన్వెస్టర్లకు ఒక యూనిట్కు రూ. 14,901 చొప్పున చెల్లించనున్నారు. 2018లో జారీ సమయంలో గ్రాము బంగారం ధర రూ. 3,114 (ఆన్లైన్ డిస్కౌంట్ తర్వాత రూ. 3,064) మాత్రమే ఉండటం గమనార్హం.

అదనపు వడ్డీతో రెట్టింపు ఉత్సాహం
కేవలం బంగారం ధర పెరగడం వల్ల వచ్చే లాభమే కాకుండా, ఈ బాండ్లపై ఏటా 2.5 శాతం స్థిర వడ్డీని కూడా ప్రభుత్వం అందిస్తోంది. ప్రారంభ పెట్టుబడిపై లెక్కించే ఈ వడ్డీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి నేరుగా ఇన్వెస్టర్ల బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. తుది వడ్డీని అసలు మొత్తంతో కలిపి మెచ్యూరిటీ సమయంలో చెల్లిస్తారు. అంటే ధర పెరగడం ద్వారా వచ్చే లాభంతో పాటు వడ్డీ కూడా తోడవ్వడంతో ఇన్వెస్టర్లకు ఇది డబుల్ ధమాకాగా మారింది.
పన్ను మినహాయింపు.. ఇన్వెస్టర్లకు వరం!
సార్వభౌమ గోల్డ్ బాండ్ల ద్వారా వచ్చే మరో ప్రధాన ప్రయోజనం పన్ను మినహాయింపు. వ్యక్తిగత పెట్టుబడిదారులు జారీ సమయంలో బాండ్లు కొనుగోలు చేసి, ఎనిమిదేళ్ల మెచ్యూరిటీ వరకు వాటిని అలాగే ఉంచుకుంటే, విమోచన సమయంలో వచ్చే 'మూలధన లాభాల' (Capital Gains) పై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, బడ్జెట్ 2026 నిబంధనల ప్రకారం.. సెకండరీ మార్కెట్ నుండి కొనుగోలు చేసిన బాండ్లకు లేదా గడువు ముందే విమోచించుకున్న వాటికి ఈ పన్ను మినహాయింపు వర్తించదు. బంగారంపై భౌతిక రూపంలో కాకుండా డిజిటల్ రూపంలో పెట్టుబడి పెట్టడం వల్ల భద్రతతో పాటు అద్భుతమైన లాభాలు వస్తాయని ఈ సిరీస్ నిరూపించింది.












Click it and Unblock the Notifications