బీజేపీకి చెమట, మోడీకి ఎదురుదెబ్బ: బీజేపీ ఆధిక్యంతో తిరిగి పుంజుకున్న మార్కెట్లు
అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల ఫలితాలు నిమిష నిమిషానికి తారుమారు అవుతున్నాయి. బీజేపీకి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీని ఇస్తోంది. ఆరోసారి గెలుద్దామనుకుంటున్న కమలం పార్టీకి కాంగ్రెస్ పార్టీ షాకిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Recommended Video
ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి. గుజరాత్ ఎన్నికల ప్రభావంతో మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. బీజేపీ గెలుపు ఆశలతో ఉదయం ఊపిమీద కనిపించాయి. కాంగ్రెస్ పార్టీ లీడింగ్లోకి రాగానే మళ్లీ మార్కెట్లు నష్టపోయాయి. ఆ తర్వాత బీజేపీ పుంజుకోగానే మళ్లీ కోలుకున్నాయి.
700 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంటోంది. దీని ఫలితం స్టాక్ మార్కెట్లపై పడుతోంది. కాంగ్రెస్ దూసుకెళ్తుండటంతో సెన్సెక్స్ ఓ దశలో 700 పాయింట్లకు పైగా నష్టపోయింది.
గుజరాత్ సస్పెన్స్
గుజరాత్ ఫలితాలు సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. ఓసారి బీజేపీ, మరోసారి కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతోంది. మొత్తానికి రెండు పార్టీలు కూడా 90 సీట్లకు అటు ఇటుగా ఉంటున్నాయి. దీంతో ఎవరు గెలుస్తారనే ఆసక్తి అందరిలోను కనిపిస్తోంది.
బీజేపీకి చెమటలు
బీజేపీ 150 సీట్లు గెలుస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ నేతలు, రాహుల్కు ధీటుగా మోడీ, అమిత్ షా సహా బీజేపీ నేతలు చెమటోడ్చారు. కానీ ఫలితాల రోజు మాత్రం బీజేపికి చెమటలు పడుతున్నాయి.
మోడీకి ఇది ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు
బీజేపీకి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీని ఇవ్వడం ఓ విధంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. మోడీ సొంత రాష్ట్రంలో బీజేపీ గెలుపు సులభంగా జరగకపోతుండటం గమనార్హం. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ గెలిచినా గెలవచ్చుననే విధంగా ఫలితాలు ఉన్నాయి.