నేను పారిపోలేదు.. ఇండియా వెళ్లలేను: లెక్కలు బయటపెట్టిన విజయ్ మాల్యా..
ఒకప్పుడు ఇండియన్ కార్పొరేట్ రంగాన్ని ఏలిన లిక్కర్ బారన్, కింగ్ఫిషర్ అధినేత విజయ్ మాల్యా మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తాను దేశం విడిచి పారిపోయిన 'భగోడా' (ఆర్థిక నేరస్థుడిని) కాదని, చట్టబద్ధంగానే లండన్లో ఉంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు పెడుతూ.. భారత ప్రభుత్వం తన పట్ల అత్యంత అన్యాయంగా ప్రవర్తిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. 1992 నుంచి తాను యునైటెడ్ కింగ్డమ్ శాశ్వత నివాసిగా ఉంటున్నానని తెలిపిన మాల్యా, అక్కడి చట్టపరమైన నిబంధనలు, ఆంక్షల వల్లే తాను బ్రిటన్ వదిలి రాలేకపోతున్నానని వివరణ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తనను కావాలనే "పోస్టర్ బాయ్"గా మార్చి నిందలు వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
బ్యాంకులను ముంచేశానంటూ మీడియాలో వస్తున్న వార్తలపై మాల్యా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాంబే హైకోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అఫిడవిట్లోని అంశాలను ఆయన బయటపెట్టారు. కోర్టు తీర్పు ప్రకారం తాను చెల్లించాల్సిన అసలు అప్పు మొత్తం రూ. 6,203 కోట్లు కాగా, 2021 నాటికే ఈడీ తన నుంచి రూ. 14,131.60 కోట్లు రికవరీ చేసుకుందని లెక్కలతో సహా పేర్కొన్నారు. తనకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుని, డిమాండ్ చేసిన దానికంటే దాదాపు రెట్టింపు కన్నా ఎక్కువ మొత్తాన్ని రాబట్టినప్పటికీ, తనను ఇంకా "ఫ్రాడ్" లేదా నేరస్థుడిగా ఎందుకు సంబోధిస్తున్నారని ప్రశ్నించారు. అంతేకాకుండా, రికవరీ చేసిన దాంట్లో మిగిలిన అదనపు డబ్బును తనకు ఎప్పుడు రీఫండ్ చేస్తారో మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.

ఆస్తులు జప్తు చేయడం వల్లే ఈ పరిస్థితి!
కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఉద్యోగుల జీతాల బకాయిల అంశంపై కూడా మాల్యా స్పష్టతనిచ్చారు. ఈడీ జప్తు చేసిన తన నిధుల నుంచే దాదాపు రూ. 350 కోట్లకు పైగా మొత్తాన్ని ఉద్యోగుల వేతనాల కోసం విడుదల చేసినట్లు గుర్తుచేశారు. అప్పట్లో ప్రభుత్వం , దర్యాప్తు సంస్థలు తన ఆస్తులన్నింటినీ అటాచ్ చేయడం వల్లే తాను సొంతంగా ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోయానని, అంతే తప్ప కావాలని ఎగ్గొట్టలేదని సమర్థించుకున్నారు. దేశంలో పెద్ద పెద్ద రుణగ్రహీతలు అసలు మొత్తంలో ఐదో వంతుతో సెటిల్మెంట్లు చేసుకుంటుంటే, తన వద్ద నుంచి మాత్రం పరిమితికి మించి వసూలు చేసి అన్యాయం చేశారని ఆరోపించారు.
చట్టం ముందర అందరూ సమానులే.. రప్పించి తీరుతాం: విదేశాంగ శాఖ స్పష్టత
మరోవైపు, విజయ్ మాల్యా ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. 2018 నాటి 'భారత పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల చట్టం' కింద కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్లో ప్రకటించిన 15 మంది ప్రధాన నేరస్థుల జాబితాలో మాల్యా పేరు ప్రముఖంగా ఉందనే విషయాన్ని స్పష్టం చేసింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు.
ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారిని తిరిగి భారత్కు రప్పించి, ఇక్కడి న్యాయస్థానాల ముందు నిలబెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ ప్రక్రియలో అంతర్జాతీయ చట్టాలు, పలు రకాల న్యాయపరమైన చిక్కులు ఉన్నప్పటికీ, బ్రిటన్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.
భారత్కు వస్తారో లేదో చెప్పాలని హెచ్చరిక!
కాగా, గతంలో ఈ చట్టాన్ని , తనను 'పరారీలో ఉన్న నేరస్థుడిగా' ప్రకటించడాన్ని సవాలు చేస్తూ విజయ్ మాల్యా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు మాల్యా వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. న్యాయస్థానం పరిధి నుంచి తప్పించుకు తిరుగుతూ, ఇక్కడి చట్ట విచారణకు సహకరించకుండా కోర్టు నుంచి ఊరట కోరడం సరికాదని చీఫ్ జస్టిస్ చంద్రశేఖర్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆయన నిజంగా భారత్కు తిరిగి వచ్చి కోర్టు విచారణకు హాజరవుతారో లేదో స్పష్టమైన సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో ఆయన పిటిషన్ను తిరస్కరిస్తామని కోర్టు చివరి అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం ఒకవైపు చట్టపరమైన ఉచ్చు బిగుస్తుండటం, మరోవైపు సోషల్ మీడియాలో మాల్యా లేవనెత్తుతున్న లెక్కల వివాదంతో ఈ వ్యవహారం మళ్లీ వేడెక్కింది.














Click it and Unblock the Notifications
