రారాజులా రూపాయి.. నేడే ఫెడ్ చైర్మన్ కీలక ప్రకటన!
అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిణామాలు భారత కరెన్సీకి కొత్త ఉతమిచ్చాయి. మూడు నెలల తర్వాత బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు తొలిసారిగా బ్యారెల్కు 80 డాలర్ల దిగువకు పడిపోవడం, మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడుతుండటంతో రూపాయి బలపడింది. నేడు (జూన్ 17) మార్కెట్ ప్రారంభంలోనే డాలర్తో పోలిస్తే రూపాయి 10 పైసలు లాభపడింది.
గత సెషన్లో 94.56 వద్ద ముగిసిన రూపాయి, నేడు 94.46 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. వరుసగా నాలుగో రోజు కూడా రూపాయి తన విజయయాత్రను కొనసాగించడమే కాకుండా, ఈ నాలుగు రోజుల్లోనే ఏకంగా 1 శాతానికి పైగా లాభపడటం విశేషం. విదేశీ పెట్టుబడులు భారీగా తరలివచ్చే అవకాశాలు ఉండటం, డాలర్-రూపాయి విలువ 94.80 మార్కు కంటే దిగువకు పడిపోవడంతో.. రాబోయే రోజుల్లో ఇది 94.00 నుండి 93.80 స్థాయికి చేరే అవకాశం ఉందని సీఆర్ ఫారెక్స్ అడ్వైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ పబారీ విశ్లేషించారు.

బ్రెంట్ క్రూడ్ ధరలు..
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందానికి సంబంధించిన కీలక వివరాలు బయటకు రావడంతో బ్రెంట్ క్రూడ్ ధరలు సుమారు 5 శాతం క్షీణించి, ప్రస్తుతం బ్యారెల్కు 79 డాలర్ల సమీపంలో ట్రేడవుతున్నాయి. ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేయకుండా అడ్డుకుంటూనే, ఆ దేశం ముడి చమురును అమ్ముకునేందుకు వీలు కల్పించేలా ఈ ఒప్పందం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ శుక్రవారం జెనీవాలో జరగబోయే కీలక సమావేశంలో ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు జరగనున్నాయి.
నేడే ఫెడ్ నిర్ణయం..
మరోవైపు, పెట్టుబడిదారుల కళ్లన్నీ ఈరోజు జరగనున్న యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయంపైనే ఉన్నాయి. ఈ సమావేశంలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నప్పటికీ, భవిష్యత్ ఆర్థిక అంచనాలపై ఫెడ్ చేసే ప్రకటనలు కీలకం కానున్నాయి. ముఖ్యంగా కొత్త ఫెడ్ చైర్మన్ కెవిన్ వార్ష్ నేతృత్వంలో జరుగుతున్న మొదటి పాలసీ ప్రకటన కావడం వల్ల మార్కెట్లలో తీవ్ర ఆసక్తి నెలకొంది.














Click it and Unblock the Notifications