Work From Home కావాలా? ఇంటి నుంచే బాక్సులు తెచ్చుకోండి
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ ఐటీ రంగాన్ని ఊహించని చిక్కుల్లో పడేశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా దెబ్బతినడం, దేశీయంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరతకు దారితీసింది. దీంతో చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లోని ఐటీ దిగ్గజాలు తమ ఉద్యోగుల కోసం కీలక మార్పులు చేపట్టాయి.
గ్యాస్ కొరత కారణంగా ఆఫీసు క్యాంటీన్లలో భోజన సదుపాయం కల్పించడం కష్టంగా మారడంతో, హెచ్సీఎల్టెక్ (HCLTech) తన చెన్నై ఉద్యోగులకు మార్చి 12, 13 తేదీలలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. క్యాంటీన్ సేవలకు అంతరాయం కలగడం వల్ల ఉద్యోగులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిరంతర ఎల్పీజీ కొరత వల్ల ఇప్పటికే పలు రెస్టారెంట్లు మూతపడటం, ధరలు భారీగా పెరగడం (గృహ గ్యాస్పై రూ.60, కమర్షియల్ సిలిండర్పై రూ.144) పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

"ఇంటి నుంచే బాక్సులు తెచ్చుకోండి"
మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సైతం బెంగళూరు, చెన్నై కేంద్రాల్లోని తన ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసింది. గ్యాస్ కొరత కారణంగా క్యాంటీన్లలో మెనూను భారీగా తగ్గించామని, లైవ్ కౌంటర్లను నిలిపివేసినట్లు స్పష్టం చేసింది. ఉద్యోగులు వీలైనంత వరకు ఇంటి నుంచే భోజనం తెచ్చుకోవాలని సూచించింది. లక్షలాది మంది ఉద్యోగులు ఉన్న ఈ కంపెనీల్లో ఇలాంటి పరిస్థితి రావడం గమనార్హం.
బాధ్యతాయుతంగా స్పందిద్దాం: వెల్స్ఫార్గో ఉపాధ్యక్షుడు
దేశంలో నెలకొన్న గ్యాస్ సంక్షోభంపై వెల్స్ఫార్గో ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ కట్టకం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంధనాన్ని ఆదా చేసేందుకు కంపెనీలు స్వచ్ఛందంగా WFH ఇవ్వాలని కోరారు. వేల మంది ఉద్యోగులు ఆఫీసులకు రావడం వల్ల భారీగా ఇంధనం ఖర్చవుతుందని, ఆ ప్రయాణాలు తగ్గిస్తే.. మిగిలిన ఇంధనాన్ని అత్యవసర సేవలు, లాజిస్టిక్స్ వంటి కీలక రంగాలకు మళ్లించవచ్చని ఆయన లింక్డ్ఇన్ ద్వారా సూచించారు.
డొమినో ఎఫెక్ట్: భద్రతపై ఆందోళన
పశ్చిమాసియా సంక్షోభం కేవలం వంట గ్యాస్తోనే ఆగడం లేదు. గల్ఫ్ దేశాల్లో సుమారు 90 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. అక్కడ వ్యాపారాలు చేస్తున్న కంపెనీలు ఇప్పటికే సీనియర్ నియామకాలను నిలిపివేశాయి. ఇంధనం, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్ రంగాలపై ఈ యుద్ధ ప్రభావం పడటంతో ఉద్యోగుల బోనస్లపై కూడా ఒత్తిడి ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ కంపెనీలు ఇప్పటికే వార్రూమ్లను ఏర్పాటు చేసి భద్రతా ప్రోటోకాల్స్ను సిద్ధం చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications