రుణ బకాయిలు: ల్యాంకో ఇన్ఫ్రా మూసివేతకు ఎన్సీఎల్టీ అనుమతి
హైదరాబాద్: ఇన్ఫ్రా రంగంలో కార్పొరేట్ దిగ్గజం ల్యాంకో ఇన్ఫ్రా మూసివేయనున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ బకాయిలను చెల్లించకపోవడంతో లిక్విడేషన్కు అనుమతిస్తూ సోమవారం జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.
రుణ పరిష్కార ప్రణాళికను రుణదాతల కమిటీ ఆమోదించకపోవడంతో లిక్విడేషన్కు అనుమతించాలంటూ దివాలా పరిష్కార నిపుణులు (ఆర్పీ) శావన్ గొడియావాలా దరఖాస్తు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ జ్యుడిషియల్ సభ్యులు మురళి ల్యాంకో ఇన్ఫ్రా మూసివేత చర్యలు చేపట్టాలంటూ ఆర్పీకి అనుమతించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న బోర్డు, ఇతర మేనేజ్మెంట్, భాగస్వాముల అధికారాలను రద్దు చేస్తూ వాటన్నింటినీ లిక్విడేటర్కు బదలాయించారు. మూసివేత ప్రక్రియపై బహిరంగ ప్రకటన అతి త్వరలో జారీ చేయనున్నారు. లిక్విడేషన్ ప్రారంభమైన 75 రోజుల్లో ప్రాథమిక నివేదికను అడ్జుడికేటింగ్ అథారిటీకి సమర్పించాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు.
రూ.3608 కోట్ల బకాయిలను చెల్లించకపోవడంతో దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభించాలంటూ ఐడీబీఐ బ్యాంకు దాఖలు చేసింది. మొత్తం అన్ని బ్యాంకులు, రుణదాతలకు కలిపి రూ.49,959 కోట్ల రావాల్సి ఉందట. అయితే రూ.47,721 కోట్లు రుణ బకాయిలున్నట్లు ల్యాంకో ఇన్ఫ్రా అంగీకరించింది.
కాగా, ఐడీబీఐ దరఖాస్తుపై విచారించిన ట్రైబ్యునల్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (సీఐఆర్పీ)కి అనుమతిస్తూ 2017 ఆగస్టు 7న ఉత్తర్వులు జారీ చేసింది. దివాలా పరిష్కార ప్రక్రియ నిపుణుడిగా శావన్ గొడియావాలను నియమించింది. ఈ ఏడాది జనవరిలో మరో 90 రోజులు పొడిగించగా అది కూడా మే 4తో ముగిసింది. ల్యాంకో ఇన్ఫ్రా రుణపరిష్కార ప్రణాళికను సమర్పించడానికి ప్రకటన జారీ చేయగా 7 కంపెనీలు ఆసక్తి చూపాయి. కాని అవి సమర్పించిన ప్రణాళికలు రుణదాతల కమిటీ ఆమోదం తెలుపలేదు.