Stock Market : 23,300 మార్క్ దాటి నిఫ్టీ.. ఐటీ, బ్యాంకింగ్ షేర్లకు భారీ మద్దతు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ట్రేడింగ్ను ఉత్సాహంగా ముగించాయి. గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో భారత్తో సహా పలు దేశాలపై సుంకాలు విధించే అవకాశం ఉన్నప్పటికీ, మన మార్కెట్లు మాత్రం సానుకూల పవనాలపై నడిచాయి.. ఐటీ, బ్యాంకింగ్ రంగాల స్టాక్స్లో కొనుగోళ్ల జోరు కనిపించడంతో సూచీలు లాభాల పంట పండించాయి.
ముఖ్యంగా సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్ల భారీ లాభంతో ముగిశాయి. ఇక నిఫ్టీ సైతం 23,300 పాయింట్ల కీలక స్థాయిని దాటి పైకి ఎగబాకింది. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 1:30 గంటలకు ట్రంప్ తన సుంకాలను ప్రకటిస్తారని భావిస్తున్న తరుణంలో, మార్కెట్లు ఇంతటి సానుకూల స్పందన చూపడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు, ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే సుంకాలు అమల్లోకి వస్తాయని శ్వేతసౌధం ఇప్పటికే స్పష్టం చేసింది.

ఈ ఉత్సాహభరితమైన ట్రేడింగ్లో సెన్సెక్స్ ఉదయం 76,146.28 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఆరంభంలో స్వల్ప ఒడిదుడుకులు కనిపించినప్పటికీ, చివరి గంటల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీ ఒక్కసారిగా దూసుకుపోయింది. ఇంట్రాడేలో 76,064.94 మధ్య 76,680.35 పాయింట్ల మధ్య ఊగిసలాడిన సెన్సెక్స్ చివరికి 592.93 పాయింట్ల లాభంతో 76,617.44 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా అదే బాటలో పయనించి 166.65 పాయింట్లు లాభపడి 23,332.35 వద్ద ముగిసింది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.51 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్ 30 సూచీలో జొమాటో, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ, టెక్ మహీంద్రా షేర్లు అద్భుతమైన లాభాలను ఆర్జించాయి. అయితే, నెస్లే ఇండియా, పవర్గ్రిడ్ కార్పొరేషన్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్ , ఎల్అండ్టీ వంటి షేర్లు స్వల్ప నష్టాలను చవిచూశాయి.
ఇక అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 74.21 డాలర్ల వద్ద, బంగారం ఔన్స్ ధర 3163 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా తీసుకునే నిర్ణయాలు రానున్న రోజుల్లో దేశీయ మార్కెట్లపై ఎటువంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. అయితే, ప్రస్తుతానికి మాత్రం భారతీయ స్టాక్ మార్కెట్లు సానుకూల దృక్పథంతో ముగియడం ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చే అంశం.












Click it and Unblock the Notifications