ఏం చేస్తారో చేసుకోండి! పీఎన్బీ అధికారులతో నిషాల్ మోదీ నిరక్ష్యం
ముంబై: మీరేం చేసుకుంటారో, చేస్తారో చేసుకోండని డబ్బులను తిరిగి చెల్లించాలన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) అధికారులతో నీరవ్ మోదీ సోదరుడు నిషాల్ మోదీ తలతిక్క సమాధానం ఇచ్చారు. పీఎన్బీలో వెలుగు చూసిన రూ.11,400 కోట్ల ఈ కుంభకోణాన్ని సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసుపై సీబీఐకి ఫిర్యాదు చేయడానికి ముందు నీరవ్ సోదరుడితో తాము మాట్లాడినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు ఆదివారం పీఎన్బీ అధికారులు తెలిపారు. తమ శాఖ వద్దకు పిలిపించిన నీరవ్ సోదరుడిని తీసుకున్న సొమ్ము మొత్తం తిరిగిచ్చేయాలని బ్యాంక్ అధికారులు కోరారు.
అందుకు అతను నిరాకరించాడని, తమ వద్ద ఇప్పుడు డబ్బులు లేవని మీరేం చేయాలనుకుంటున్నారో.. చేసుకోండి అని అక్కడ్నుంచి జారుకున్నట్లు బ్యాంక్ అధికారులు ఈడీకి వివరించారు. దాంతోనే తాము సీబీఐని ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు. కాగా, గత నెలాఖరులో సీబీఐ కేసు నమోదు చేయగా, మొదటి వారంలోనే నీరవ్ మోదీ, ఆయన భార్య, సోదరుడు, మేనమామ మెహుల్ చోక్సీలు విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే.

ముఖేశ్ ఆంటిలియా హౌజ్లో పెళ్లి సంబురాలు
దేశీయ ఆర్థిక వ్యవస్థను, అంతకుమించి భారతీయ బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తున్న పీఎన్బీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ సోదరుడైన నిషాల్ మోదీ.. ఎవరో కాదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ, అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) సారథి అనిల్ అంబానీల ముద్దుల మేనకోడలు ఇషీతా సల్గావ్కర్ భర్తే. గోవాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త దత్తరాజ్ సల్గావ్కర్ కూతురే ఇషీతా. దత్తరాజ్నే ముకేశ్ అంబానీ సోదరి దీప్తి వివాహం చేసుకుంది. వీరిరువురి గారాలపట్టే ఇషీతా, నిషాల్ మోదీ-ఇషీతాల ఎంగేజ్మెంట్ ముంబైలోని ట్రిడెంట్లో ఘనంగా జరిగింది. వీరి పెండ్లికి ముందు జరిగిన వేడుక ముఖేశ్ ఆంటిలియా హౌజ్లో జరుగడం విశేషం.

25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న భారత ఆభరణాల పరిశ్రమ
పీఎన్బీలో వెలుగు చూసిన కుంభకోణం ఫలితంగా సమీప భవిష్యత్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల నుంచి తదుపరి రుణ పరపతి లభించడం కష్టమేనని చెబుతున్నారు. సాధారణంగా సంబంధిత సంస్థల ప్రమోటర్ల సమగ్రత, సచ్చీలతపైనే ఆధారపడి బ్యాంకులు రుణాలిస్తుంటాయి. కానీ నీరవ్ మోదీ ఉదంతం బ్యాంకులను పునరాలోచింపజేస్తున్నదని ఆభరణాల వ్యాపారులు చెబుతున్నారు. అసోచామ్ నేషనల్ కౌన్సిల్ ఆన్ జువెలర్లీ విభాగం చైర్మన్ శంకర్ సేన్ మాట్లాడుతూ తమ పరిశ్రమ ఇక నుంచి ఫైనాన్స్ పొందాలంటే కష్టమే అవుతుందన్నారు. పూర్తిగా పెట్టుబడుల ఆధారిత వ్యాపారమని చెప్పారు. భారతీయ ఆభరణాల పరిశ్రమ పూర్తిగా ఎగుమతులు, దేశీయ వ్యాపారంపై ఆధార పడి ఉన్నదన్నారు. దేశీయ వ్యాపారం అంటే తప్పనిసరిగా చిన్న వ్యాపారులు నిర్వహిస్తుంటారని, వారికి రుణాలతో పెద్దగా అవసరం లేదన్నారు కానీ విదేశాలకు ఎగుమతి చేసే ఆభరణాల వ్యాపారులకే కష్ట సాధ్యంగా మారుతుందన్నారు. భారత ఆభరణాల పరిశ్రమలో ఐదు లక్షల మందికి పైగా సంస్థలు ఉన్నాయి. 25 లక్షల మంది ఉద్యోగులు ఆధారపడి జీవిస్తున్నారు. దేశ జీడీపీలో దాని వాటా 6 - 7 శాతంగా ఉంటుంది. ఎస్బీఐ అధికారి కథనం ప్రకారం గత మూడేళ్లలో ఆభరణాల వ్యాపారానికి రుణాలు తగ్గుముఖం పట్టాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications