ముఖేష్ వేతనం పదిహేనోసారి కూడా అంతే, రూ.24 కోట్లు వదులుకుంటున్నారు
ముంబై: రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన వార్షిక వేతనాన్ని వరుసగా పదో ఏడాది కూడా రూ.15 కోట్లకే పరిమితం చేసుకున్నారు. 2017-18లోనూ అంతే మొత్తాన్ని అందుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్కు ఛైర్మన్ హోదాలో 2008-09 నుంచి జీతం, భత్యాలు, కమిషన్ అన్నింటిని కలిపి రూ.15 కోట్లు తీసుకుంటున్నారు.దాదాపు ఏటా రూ.24 కోట్లు వదులుకుంటున్నారు.
నిఖిల్, హితాల్ మేస్వానీలలతో పాటు కంపెనీ ఇతర శాశ్వత డైరెక్టర్ల వేతనాలు మాత్రం మార్చి 31, 2018తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారీగా పెరిగాయి.యాజమాన్య వేతన స్థాయిలు తక్కువగా ఉండాలని చెప్పడానికి వ్యక్తిగత ఉదాహరణగా ముఖేష్ నిలిచారని, అందుకే రూ.15 కోట్లకే వేతనాన్ని పరిమితం చేసుకున్నారని రిలయెన్స్ పేర్కొంది.
ముఖేష్ అంబానీకి 2017-18 వేతనంలో రూ.4.49 కోట్ల జీతభత్యాలున్నాయి. 2016-17 సంవత్సరానికి రూ.4.16 కోట్ల జీతభత్యాలు ఉన్నాయి. కమిషన్ రూ.9.53 కోట్లు. ఇందులో మార్పులేదు. ఇతర భత్యాలు మాత్రం రూ.60 లక్షల నుంచి రూ.27 లక్షలకు తగ్గింది. ఇక పదవీ విరమణ ప్రయోజనాలు రూ.71 లక్షలుగా ఉన్నాయి.
సీఈఓల వేతన పరిమాణాలపై చర్చ నేపథ్యంలో అక్టోబరు 2009న ముఖేష్ తన వేతనాన్ని స్వచ్ఛందంగా రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. ఇతర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల వేతనాలు పెరిగినప్పటికీ ఆయనకు పెరగలేదు. అంబానీ బంధువులు నిఖిల్ ఆర్. మేస్వానీ, హితాల్ ఆర్ మేస్వానీల వేతనాలు ఒక్కొక్కరికి రూ.19.99 కోట్లకు పెరిగాయి. 2016-17లో వీరు రూ.16.58 కోట్లు చొప్పున అందుకున్నారు.
నీతా అంబానీ సహా రిలయన్స్ ఇండస్ట్రీస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు రూ.1.5 కోట్ల చొప్పున కమిషన్ లభించింది. అంత క్రితం ఇది రూ.1.3 కోట్లుగా ఉంది. నీతా అంబానీకు సిట్టింగ్ ఫీజు కింద రూ.6 లక్షలు పొందారు. నీతా అంబానీ కాకుండా మరికొందరు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉన్నారు.