బడ్జెట్పై మోదీ కుండబద్దలు: జనరంజకం మాటే లేదు.. సంస్కరణల బాటేనని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్.. ప్రజాకర్షక బడ్జెట్ కాదని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టమైన సంకేతాలే ఇచ్చారు. 'మోదీ సర్కారు ఈ టర్మ్లో ప్రవేశపెట్టే ఆఖరు బడ్జెట్ ఇదే కాబట్టి సంక్షేమానికి పెద్ద పీట వేస్తారు' అంటూ విశ్లేషకులు వేసిన అంచనాలను కొట్టిపారేశారు! 'ప్రజలు తాయిలాలను, ఉచితపథకాలను కోరుకోరు. వారు కోరుకునేది సుపరిపాలన' అని తేల్చిచెప్పారు! కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే ఆ పార్టీ సైతం తన సంస్కృతి నుంచి బయటపడాలన్నదే తన ఉద్దేశమని ఒక టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
Recommended Video
'బడ్జెట్ ప్రతిపాదనల విషయం ఆర్థిక మంత్రి పరిధిలో ఉంటుంది. దాంట్లో నేను జోక్యం చేసుకోను. అయితే, గుజరాత్ సీఎంగా, ప్రధాన మంత్రిగా నన్ను చూసిన సామాన్యప్రజలు.. తాయిలాలను, ఉచిత పథకాలను కోరుకోరు. అలా కోరుకుంటారనుకుంటే అది భ్రమే. సామాన్యులు కోరుకునేది సుపరిపాలనను. సామాన్య ప్రజల అవసరాలను, ఆకాంక్షలను నెరవేర్చే విధంగా మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది' అని వ్యాఖ్యానించారు.
జీఎస్టీకి అలవాటు పడేందుకు సమయం పడుతుందని వ్యాఖ్య
దశాబ్దల తరబడి సంప్రదింపుల తర్వాత అమలులోకి తీసుకొచ్చిన జీఎస్టీ విషయంలో మార్పుచేర్పులకు తమ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. అందులోని లొసుగులను పూడ్చి మరింత సమర్థంగా మార్చే పనిలో ఉన్నామన్నారు. జీఎస్టీని వ్యతిరేకించేవారు పార్లమెంటును అవమానిస్తున్నట్టే అయినా.. 1961 నుంచి ఆదాయపన్ను చట్టానికి ఎన్ని మార్పులు చేశారో గుర్తుందా? అని ప్రశ్నించారు. జీఎస్టీ ఒక కొత్త విధానం. దీనికి అలవాటు పడటానికి ప్రజలకు కొంత సమయం పడుతుంది. జీఎస్టీని సిద్ధాంతపరంగా అందరూ ఆమోదించారని, ఏడేళ్ల చర్చ తర్వాత పార్లమెంట్ దాన్ని ఆమోదించిందని గుర్తు చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా రైతు సమస్యలు పరిష్కరించాలి
రైతుల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని ప్రధాని మోదీ అంగీకరించారు. ‘వ్యవసాయ రంగం దుస్థితిపై విమర్శలు న్యాయమే. దాన్ని మేం కొట్టిపారేయలేం. అయితే, అది మా ఒక్కరి బాధ్యతమాత్రమే కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత. రెండూ కలిసి రైతుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించాలి. మా ప్రభుత్వం అమలు చేస్తున్న పంట బీమా, సాగు నీటిపారుదల పథకాలు, భూసార కార్డులు, యూరియా లభ్యత పెంపు వంటివన్నీ అందులో భాగాలే. సోలార్ పంపులు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, గ్రామీణ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల వంటివి నా మదిలో ఉన్నాయి' అని ప్రధాని మోదీ వివరించారు.
భారత్ ప్రతిష్ఠ ఇనుమడింపజేసిన నోట్ల రద్దు
నోట్ల రద్దు విషయమై అగ్గి రాజేసి, ఘర్షణలు రెచ్చగొట్టాలని చాలా మంది చూశారని ప్రధాని మోదీ ఆరోపించారు. కొందరు సుప్రీంకోర్టు తలుపులు కూడా తట్టారని, నల్లధన కుబేరులను, అవినీతిపరులను కాపాడటానికి వారు చేయగలిగిన ప్రతి ప్రయత్నం చేశారని మండి పడ్డారు. కానీ, నోట్ల రద్దు ఒక విజయగాథ అని ప్రధాని మోదీ సమర్థించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేసిన నిర్ణయమన్నారు.
70 లక్షల ఈపీఎఫ్ ఖాతాల్లో అత్యధికం యువతవే
ఉపాధి కల్పనపై అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ప్రధాని మోదీ చెప్పారు. ఉపాధి రహిత అభివ్రుద్ధి అబద్దం అన్నారు. వ్యవస్థీకృత రంగం ద్వారా 10 శాతం ఉద్యోగాలు, అవ్యవస్థీకృత రంగం ద్వారా 90 శాతం ఉద్యోగాలు వస్తాయన్నారు. గత ఏడాది గణాంకాలే తీసుకుంటే.. 70 లక్షల కొత్త ఈపీఎఫ్ ఖాతాలు ప్రారంభించినవారిలో 18-25 ఏళ్ల వయసువారే ఎక్కువ మంది అని ప్రదాని మోదీ గుర్తు చేశారు. ఇది కొత్త ఉద్యోగాల కల్పన కిందకు రాదా? అవ్యవస్థీకృత రంగంలో పనిచేసేవారి గణాంకాలు దొరకవన్నారు. 2014 నుంచి చాలామంది సీఏలు, లాయర్లు, డాక్టర్లు, కన్సల్టెంట్లు కొత్తగా వచ్చారు. కొత్తగా ఉపాధి కల్పించకుండా గత మూడేళ్లలో రహదారుల నిర్మాణం, రైల్వే ట్రాకుల నిర్మాణం రెట్టింపు అయ్యేది కాదన్నారు. విద్యుదీకరణ, రేవు పనుల వంటివి కొత్త ఉద్యోగాలు లేకుండా వేగవంతమయ్యేవి కావని, జౌళి, తోలు రంగాల్లో ఉపాధిని ప్రోత్సహించే విధంగా మా విధానాలు ఉంటున్నాయని తెలిపారు. అలాగే.. 10 కోట్ల మంది నాన్ కార్పొరేట్, చిన్నపరిశ్రమల వారికి ముద్ర యోజన కింద రుణాలు ఇచ్చాం అని ప్రధాని నరేంద్రమోదీ వివరించారు.
మూడేళ్లోనే అన్ని ఆర్థిక పరిమితుల్లో ప్రగతి సాధించాం
2013-14లో అంటే మా ప్రభుత్వం పాలనాపగ్గాలు చేపట్టేనాటికి భారతదేశం ప్రపంచంలోనే ఐదు దుర్బల ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉండేదని చెప్పుకొచ్చారు. కానీ, మూడేళ్లలోనే ఆ దుస్థితి నుంచి బయటపడి, ఆశావాదంతో, సరికొత్త అంచనాలతో ఆకాశంలో తారలా తళుకులీనుతోందన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల.. ఇలా అన్ని ఆర్థిక పరిమితుల్లోనూ గత మూడేళ్లలో 3 శాతం వృద్ధి సాధించిందని చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 62 మిలియన్ డాలర్ల నుంచి 30 బిలియన్ డాలర్లకు పెరిగాయని, ఆర్థిక లోటు 4.5 శాతం నుంచి 3.5 శాతానికి, కరెంటు ఖాతాలోటు 4 శాతం నుంచి 1-2 శాతానికి తగ్గిందన్నారు. ఎన్డీయే పాలన వచ్చాక.. సులభతర వ్యాపార నిర్వహణలో భారతదేశం 42 స్థానాలు ఎగబాకి, తన ఆర్థిక బలిమిని ప్రపంచానికి చూపింది. భారతదేశం ఇప్పుడు గొప్ప అవకాశాల గడ్డగా.. పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యంగా మారిందని చెప్పారు.
రాజకీయ పార్టీలు ఆ వివాదానికి దూరంగా ఉండాలి
మన న్యాయవ్యవస్థకు ఘనమైన గతం ఉన్నదని తేల్చి చెప్పారు. మన న్యాయమూర్తులు ఎంతో సమర్థులని, ఒక చోట కూచుని తమ సమస్యలకు పరిష్కారాలు కనుక్కోగలరన్నారు. దేశీయ న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చ నుంచి తాను దూరంగా ఉండాలనుకుంటున్నానని చెప్పారు. ప్రభుత్వం, రాజకీయ పార్టీలు కూడా దూరంగా ఉండాలని సూచించారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు నా రాజకీయ జీవితానికి చరమగీతం పాడాలని చాలా మంది చేసిన ప్రయత్నాలన్నీ తానీ ఈ స్థాయికి చేరడానికి ఉపయోగపడ్డాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.
ఆరోగ్య పరమైన రాజకీయాల కోసం ప్రధాని మోదీ
కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే.. అదొక సంకేతాత్మక నినాదమేనని ప్రధాని నరేంద్రమోదీ దాటేశారు. దానికి ఎన్నికల ఫలితాలతో సంబంధం లేదు. దేశ ప్రయోజనాల రీత్యా ఆ పార్టీ సైతం తన సంస్కృతి నుంచి విముక్తి పొందాల్సిన అవసరం ఉందని సూచించారు. ఒక ఆరోగ్య వంత ప్రజాస్వామ్యానికి అది తప్పనిసరి కూడా అని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఇతర పార్టీలకూ విస్తరించిందని, ఇతర పార్టీలు కూడా ఈ సంస్కృతి నుంచి బయటపడాలని రాబోయే తరాలను సైతం ఆ సంస్కృతి నుంచి పరిరక్షించాలని ప్రధాని హితబోధ చేశారు.
ట్రిపుల్ తలాక్ పై ప్రధాని నరేంద్రమోదీ ఇలా
రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు షాబానో కేసు విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సందర్భంగా చేసిన తప్పు నుంచి కాంగ్రెస్ పార్టీ నేర్చుకుని ఉండాల్సిందని త్రిపుల్ తలాక్ పై తీసుకొచ్చిన చట్టాన్నుద్దేశించి ప్రధాని మోదీ అన్నారు. నాడు షాబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతి ఒక్కరికీ గౌరవంగా జీవించే హక్కును బలపరిచే తీర్పు అని అన్నారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు అర్థం చేసుకోలేకపోయిందనేది ప్రశ్నగా మిగిలిందని ప్రదాని మోదీ చెప్పారు. రాజకీయాలు అంతగా దిగజారిపోయాయా? అమాయకులైన ఎందరో తల్లులు, సోదరీమణులు బాధపడుతున్నా కూడా తమ రాజకీయాలను కొనసాగించేలా అధికార వ్యామోహం ఉంటుందా? అని ప్రశ్నించారు. అది స్వార్థం. నన్నెంతగానో బాధించే విషయమిది. ఎన్నో ఇస్లామిక్ దేశాలు ఈ విషయంలో తమ చట్టాలను మార్చుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ , దాని తరహాలోనే ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే ఏ పార్టీ అయినా ఈ తరహా తిరోగామి మనస్తత్వం నుంచి బయటపడాలని ప్రధాని మోదీ సూచించారు. మహిళా సాధికారత, మహిళలకు గౌరవం కోణంలో ఆలోచించాలన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు రాజకీయ ఎత్తుగడ కాదని, ముస్లిం మహిళల రక్షణ కోసమే ఆ బిల్లును ప్రవేశపెట్టాం అని ప్రధాని మోదీ తెలిపారు.
పాకిస్థాన్ అంటే మాకు వ్యతిరేకం కాదన్న ప్రధాని
పాకిస్థాన్ను అంతర్జాతీయ సమాజం ముందు ఒంటరి చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఎవరైనా భావిస్తే తప్పన్నారు. ‘ప్రపంచమంతా ఉగ్రవాదం కారణంగా బాధపడుతోంది. అలాంటి ఉగ్రవాదుల పట్ల సానుభూతి చూపేవారి పట్ల ప్రపంచమంతా ఏకమవుతోంది. ప్రభుత్వం ఈ దేశంలోని ప్రతి ఒక్క పౌరుడితోనూ చర్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ‘మిస్టర్ మోదీ.. మాతో మాట్లాడండి' అని అడిగే హక్కు ప్రతి భారతీయుడికీ ఉంది. రాజ్యాంగాన్ని విశ్వసిస్తూ, దేశం కోసం ప్రాణాలు విడిచేందుకు సిద్ధపడే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారు.