1974 నాటి ఆర్థిక వినాశనానికి పడిన పునాది! ఈ మూడు ఆస్తులే ముఖ్యం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక భారీ సునామీ దిశగా పయనిస్తోందా? మనం నమ్ముతున్న కరెన్సీ నోట్లు కేవలం కాగితపు ముక్కలుగా మిగిలిపోనున్నాయా? 'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత, ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు రాబర్ట్ కియోసాకి విశ్లేషణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఐదు దశాబ్దాల క్రితం పడిన పునాదులే నేటి ఆర్థిక వినాశనానికి కారణమని ఆయన హెచ్చరిస్తున్నారు
రాబర్ట్ కియోసాకి విశ్లేషణ ప్రకారం, నేటి ఆర్థిక సంక్షోభానికి మూలాలు 1974వ సంవత్సరంలో ఉన్నాయి. ఆ సమయంలో అమెరికా తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ప్రపంచ గమనాన్ని మార్చేశాయి. ముఖ్యంగా 'గోల్డ్ స్టాండర్డ్' (బంగారు ప్రమాణం) నుంచి తప్పుకుని, పెట్రోడాలర్ వ్యవస్థ వైపు మళ్లడం వల్ల డాలర్ తన అసలు విలువను కోల్పోయిందని ఆయన వాదిస్తున్నారు. ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం కరెన్సీని ముద్రించడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగి, అప్పుల భారం సామాన్యుడి నడ్డి విరుస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పెన్షన్ నుంచి 401(k) వరకు.. ఉద్యోగుల పాలిట శాపమా?
1974లో వచ్చిన 'ఉద్యోగుల పదవీ విరమణ ఆదాయ భద్రతా చట్టం' (ERISA) గురించి కియోసాకి ఒక సంచలన విషయాన్ని లేవనెత్తారు. అంతకుముందు వరకు ఉన్న హామీతో కూడిన పెన్షన్ పథకాల స్థానంలో, మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడే 401(k) వంటి ఖాతాలు రావడం వల్ల రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత అనేది ఒక 'జుదం'లా మారిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. లక్షలాది మంది బేబీ-బూమర్లు తమ పని ముగించుకుని ఇంటికి వెళ్లే సమయానికి, చేతిలో చిల్లిగవ్వ లేక దిగ్భ్రాంతికి గురయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
నిజమైన డబ్బు: బంగారం, వెండి, బిట్కాయిన్!
ప్రస్తుత కరెన్సీ వ్యవస్థ కుప్పకూలుతున్న తరుణంలో కేవలం పొదుపు చేయడం వల్ల ప్రయోజనం లేదని, ఆర్థిక విద్య (Financial Education) అభ్యసించడం అత్యవసరమని కియోసాకి నొక్కి చెప్పారు. ఆయన దృష్టిలో బంగారం, వెండి, బిట్కాయిన్ మాత్రమే "నిజమైన డబ్బు". ఎందుకంటే వీటిని ప్రభుత్వాలు ముద్రించలేవు. ముఖ్యంగా బిట్కాయిన్ పట్ల ఆయన ఎంతో ఆశాభావంతో ఉన్నారు. త్వరలోనే రాబోయే ఒక భారీ "బుడగ పేలుడు" (Bubble Burst) తర్వాత, బిట్కాయిన్ ధర ఏకంగా $750,000కు చేరుకోవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.
అప్పుల ఊబి నుంచి బయటపడటం ఎలా?
ప్రభుత్వ వ్యవస్థలపై లేదా సంప్రదాయ బ్యాంకింగ్పై అతిగా ఆధారపడటం ప్రమాదకరమని కియోసాకి సూచిస్తున్నారు. పెరుగుతున్న అప్పులు, ద్రవ్యోల్బణం నుండి రక్షణ పొందడానికి ప్రత్యామ్నాయ ఆస్తులపై దృష్టి పెట్టాలని ఆయన చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్య సరఫరా పెరిగేకొద్దీ, పరిమితంగా ఉండే ఆస్తులకే భవిష్యత్తులో డిమాండ్ ఉంటుందని ఆయన విశ్లేషించారు. సంప్రదాయ వ్యవస్థలు కుప్పకూలుతున్న తరుణంలో, దూరదృష్టితో వ్యవహరించేవారే భవిష్యత్తులో ఆర్థికంగా నిలదొక్కుకుంటారని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నారు.












Click it and Unblock the Notifications