Sugar: రెండు కేజీలు మాత్రమే.. మార్కెట్లలో కొత్త రూల్స్!
పండుగల కాలం సమీపిస్తున్న వేళ సామాన్యుడి జేబుకు కత్తెర పడటంతో పాటు నిత్యావసర సరుకుల కొనుగోళ్లపై కొత్త తిప్పలు మొదలయ్యాయి. పిండివంటలు, మిఠాయిలతో ఇళ్లను తియ్యదనంతో నింపే సమయానికి చక్కెర ధరలు ఆకాశాన్నంటడమే కాకుండా, మార్కెట్లో వింత పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు పెరుగుతున్న ధరలతో భారం పడుతుంటే, మరోవైపు ఎంత డబ్బు ఇచ్చినా కావలసినంత చక్కెర దొరకని పరిస్థితి ఏర్పడింది. బ్లాక్ మార్కెట్, కృత్రిమ కొరతను అరికట్టేందుకు ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థలు, పెద్ద సూపర్మార్కెట్లు చక్కెర అమ్మకాలపై కఠిన పరిమితులు విధించడమే ఇందుకు ప్రధాన కారణం.
ఇంటికే వేగంగా సరుకులను చేరవేసే జెప్టో (Zepto), బ్లింకిట్ (Blinkit), స్విగ్గీ ఇన్స్టామార్ట్ (Swiggy Instamart) వంటి ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు చక్కెర కొనుగోళ్లపై పరిమితి విధించాయి. యాప్లలో ప్యాకెట్ల సంఖ్యను పరిమితం చేస్తూ 'స్టాక్ లభ్యత తక్కువగా ఉంది' అని సూచిస్తున్నాయి. ఉదాహరణకు స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఒక కస్టమర్ ఒక ఆర్డర్కు గరిష్టంగా రెండు కిలోల ప్యాకెట్లను మాత్రమే కొనుగోలు చేసేలా పరిమితి విధించారు. ఆన్లైన్లో ఎప్పుడు పడితే అప్పుడు బల్క్గా కొనుగోలు చేసే అవకాశం లేకపోవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సూపర్మార్కెట్లలోనూ అదే పరిమితి!
ఆన్లైన్లోనే కాకుండా భౌతికంగా సరుకులు అమ్మే పెద్ద పెద్ద రిటైల్ నెట్వర్క్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. డీమార్ట్ (DMart), రిలయన్స్ (Reliance) వంటి ప్రముఖ సూపర్మార్కెట్లలో ఒకే కస్టమర్కు 2 నుంచి 3 కిలోల కంటే ఎక్కువ చక్కెరను విక్రయించడం లేదు. పండుగల సమయంలో ఇళ్లల్లో పిండివంటలు చేయడం, వ్యాపారులు మిఠాయిల తయారీకి పెద్ద మొత్తంలో చక్కెరను నిల్వ చేసుకోవడం సాధారణం. ఇలాంటి సమయంలో క్విక్ కామర్స్, సూపర్మార్కెట్లు రెండింటిలోనూ పరిమితులు అమలులోకి రావడంతో సాధారణ వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ధరల పెంపు వెనుక అసలు కారణాలు ఇవే!
దేశీయంగా చక్కెర ఉత్పత్తి తగ్గిపోవడం, నిల్వలు పరిమితంగా ఉండటంతో ధరలు వేగంగా పెరిగాయి. ఈ పరిణామాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడకుండా ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి సుంకాలు లేకుండా ముడి చక్కెరను దిగుమతి చేసుకునేందుకు అనుమతులిచ్చిన కేంద్రం, శుద్ధి చేసిన చక్కెరగా మార్చి దేశీయ మార్కెట్లలో విక్రయించేందుకు ఇచ్చే సమయాన్ని రెండు నెలల వరకు పొడిగించింది. సుమారు 10 లక్షల టన్నుల ముడి చక్కెరను దేశంలోకి త్వరగా అందుబాటులోకి తెచ్చి ధరలను అదుపు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
పండుగ వేళ ధరలు దిగివస్తాయా?
దిగుమతి చేసుకున్న చక్కెర బహిరంగ మార్కెట్కు చేరుకోవడానికి కొంత సమయం పట్టనుంది. అంతవరకు రిటైల్ స్థాయిలో కొనుగోలు పరిమితుల ద్వారా దేనికీ కొరత రాకుండా చూడటం సంస్థల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. రోజూవారీ అవసరాలకు కేజీ, రెండు కేజీలు కొనేవారికి ఈ మార్పు పెద్దగా ప్రభావం చూపకపోయినా, పండుగల కోసం ఎక్కువగా సరుకులు కొనుగోలు చేసే కుటుంబాలకు ఇది పెద్ద సమస్యగా మారింది. రాబోయే వారాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతవరకు సత్ఫలితాలనిచ్చి చక్కెర ధరలను అదుపులోకి తెస్తాయో వేచి చూడాలి.














Click it and Unblock the Notifications