ట్విట్టర్కు మోదీ కేర్ పైనే ఆసక్తి.. బిట్ కాయిన్పై ఇలా
న్యూఢిల్లీ: గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయ వృద్ధి ప్రధానంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది బడ్జెట్లో దేనికి ఎంత కేటాయిస్తారు, ఏవి ప్రధానంగా నిలుస్తాయనే దానిపై నెటిజన్లు విపరీతంగా ఆసక్తి చూపించారు. బడ్జెట్కు సంబంధించి ఈ ఏడాది దాదాపు 14లక్షల ట్వీట్లు వచ్చినట్లు ట్విటర్ ఇండియా తెలిపింది. గత నెల 26వ తేదీ నుంచి ఫిబ్రవరి రెండో తేదీ వరకు ఈ ట్వీట్లు వచ్చాయని కంపెనీ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇటు నరేంద్రమోదీ ప్రభుత్వం, అటు అధికార బీజేపీ ఘనంగా ప్రచారం చేసుకుంటున్న 'ఆయుష్మాన్ భారత్ (మోదీ కేర్)' అనే పేరుతో ప్రతిపాదించిన జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం గురించి ఎక్కువ ట్వీట్లు వచ్చాయి.
ఆ తర్వాత నోట్ల రద్దు అంశం ప్రస్తావనకు వచ్చిందని పేర్కొంది. బడ్జెట్ ప్రసంగం ముగిసినప్పుడు అత్యధికంగా 83వేల ట్వీట్లు వచ్చినట్లు ప్రకటనలో పేర్కొంది. పలువురు రాజకీయ ప్రముఖులు, నెటిజన్లు బడ్జెట్పై తమ అభిప్రాయాలను ట్విటర్ ద్వారా పంచుకున్నారని కంపెనీ తెలిపింది.

‘మోదీ’కేర్ పైనే ట్వీట్ల వర్షం
బడ్జెట్ గురించి జరిగిన చర్చల్లో ఎక్కువగా ప్రధాని నరేంద్రమోదీ పేరును ఎక్కువమంది నెటిజన్లు ప్రస్తావించారు. తర్వాత స్థానాల్లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, సీనియర్ కాంగ్రెస్ నేత పి చిదంబరం, ప్రధాన ఆర్థిక సలహాదారుడు అరవింద్ సుబ్రమణియన్ గురించి మాట్లాడుకున్నారట. జనవరి నెలలో దాదాపు 2.4లక్షల బడ్జెట్ సంబంధిత ట్వీట్లు వచ్చినట్లు ట్విటర్ వెల్లడించింది. అంతకుముందు డిసెంబర్ నెలలో బడ్జెట్ సంబంధ ట్వీట్లతో పోలిస్తే జనవరిలో రెట్టింపు సంఖ్యలో వచ్చాయని పేర్కొన్నది. జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం ప్రతిపాదించడంతోపాటు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ తిరిగి ప్రవేశ పెట్టడం వంటి సంచలన నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్థికశాఖ, ట్విట్టర్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ప్రశ్నలు - సమాధానాలు' కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య సంరక్షణ, పెద్ద నోట్ల రద్దు, వ్యవసాయం, వ్యక్తిగత ఆదాయం పన్ను, మౌలిక సదుపాయాలు, వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) గురించి నెటిజన్లు ప్రధానంగా చర్చించుకున్నారు.

ఎగుమతులు పెరిగితేనే ఆర్థిక ప్రగతిలో పురోగతి
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల్లో దేశ ఆర్థిక ప్రగతిలో రెండంకెల అభివ్రుద్ధిపై అంచనా వేయడం వాస్తవిక పరిస్థితికి విరుద్ధమని కేంద్ర ఆర్థిక వ్యవహారాలశాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వ్యాఖ్యానించారు. 2020 - 21 నాటికి ఎనిమిది శాతాన్ని అధిగమించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. 2014 నుంచి వరుసగా మూడేళ్లలో నరేంద్రమోదీ ప్రభుత్వ హయాంలో సగటున 7.5 శాతం వ్రుద్దిరేటు నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఏడు శాతాన్ని అధిగమిస్తామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రగతి రేటు 7 - 7.5 శాతం వద్ద నమోదవుతుందని అంచనా వేశారు. అంతర్జాతీయ పరిస్థితులు కూడా దేశ ఆర్థిక ప్రగతికి అడ్డంకిగా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆర్థిక ప్రగతి 3.5 - 4 శాతంగా ఉన్నదని తెలిపారు. దేశీయ దిగుమతులను అధిగమించే స్థాయిలో ఎగుమతులు 10 శాతం పెరిగితేనే ఆర్థిక ప్రగతి రేటులో ముందుకెళ్లగలమన్నారు. కానీ వాస్తవంగా ఎనిమిది శాతం ఎగుమతులు పెరిగినా జీడీపీలో గణనీయ పురోగతి ఉంటుందన్నారు.

ఏడాది చివరికల్లా బిట్ కాయిన్ల వాడకంపై నిబంధనల అమలు
బిట్ కాయిన్ల వినియోగంపై ఉక్కుపాదం మోపడం ఖాయమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ స్పష్టం చేశారు. ఇందుకోసం చేపట్టాల్సిన నియంత్రణ చర్యలను ఈ ఏడాది చివరిలోగా అమలు చేస్తామని సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. క్రిప్టో కరెన్సీలను నిషేధించేందుకు ఏర్పాటైన కమిటీ త్వరలో నియంత్రణ చర్యలను ఖరారు చేయనున్నది. వీటిని అమలు చేయడంలో ఎదురయ్యే న్యాయపరమైన ఇబ్బందులను పరిశీలించి ఈ ఏడాది చివరిలోగా వీటిని కచ్చితంగా అమలు చేస్తాం అని ఆయన అన్నారు. క్రిప్టో కరెన్సీల వ్యాపారం చట్టబద్ధమైన వ్యవస్థలో ఉంటే వాటిపై నేరుగా విచారణ జరుపవచ్చని, కానీ ప్రస్తుతం బిట్కాయిన్ ఎక్సేంజ్లకు ఎటువంటి అనుమతులు గానీ, చట్టబద్ధత గానీ లేవని, ఆ ఎక్సేంజ్లు కనీసం రికార్డులను కూడా నిర్వహించడం లేదని తెలిపారు. బిట్కాయిన్ సహా ఇతర క్రిప్టో కరెన్సీలకు ఎటువంటి చట్టబద్ధత లేదని, కనుక వీటిలో ఎవరూ పెట్టుబడులు పెట్టవదని పదే పదే హెచ్చరిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. ఇటువంటి కరెన్సీలను పూర్తిగా నియంత్రిస్తామని ఈ నెల 1వ తేదీన పార్లమెంట్లో చేసిన సార్వత్రిక బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేసిన విషయం విదితమే.












Click it and Unblock the Notifications