పార్టీ నుంచి మాజీ సీఎం గెంటివేత: జయలలిత, ఎంజీఆర్కు భారతరత్న: ఈపీఎస్ ఫొటోకు చెప్పు దెబ్బలు
చెన్నై: తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఎన్నికయ్యారు. చెన్నై శివార్లలోని వనగరంలో గల పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశం.. ఈ మేరకు తీర్మానించింది. ఈపీఎస్ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న బైలాస్లో కీలక మార్పులు చేసింది. ద్వినాయకత్వాన్ని రద్దు చేసింది. ఏక నాయకత్వానికి ఆమోదం తెలిపింది.

నాలుగు నెలల్లోగా ఎన్నిక..
దీనితో మరో మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం.. పార్టీలో తన పదవిని కోల్పోయారు. ఆయనకు ఉన్న అన్ని హోదాలు కూడా రద్దయ్యాయి. ఇవ్వాళ్టి నుంచి నాలుగు నెలల్లోగా పార్టీలోని అన్ని స్థాయి పదవులకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుందని ఏఐఏడీఎంకే సర్వసభ్య సమావేశం తీర్మానించింది. అప్పటివరకు పార్టీ కార్యకలాపాల పర్యవేక్షణ మొత్తం కూడా పళనిస్వామి పర్యవేక్షిస్తారని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఆయనను పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది.

వారికి భారతరత్న..
ద్వినాయకత్వాన్ని రద్దు చేయడంతో పాటు మొత్తం 16 తీర్మానాలను ఈ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈరోడ్ వెంకటప్ప రామస్వామి పెరియార్, పార్టీ అధినేతలు దివంగత ఎంజీ రామచంద్రన్, జయలలితకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని రావాలని తీర్మానించింది. నిన్నటివరకు కొనసాగుతూ వచ్చినా సమన్వయకర్త, సహ సమన్వయకర్త పోస్టులను సర్వసభ్య సమావేశం రద్దు చేసింది.

ప్రధాన కార్యదర్శి పోస్ట్..
ద్వినాయకత్వాన్ని రద్దు చేసి, దాని స్థానంలో ప్రధాన కార్యదర్శి హోదాను తెర మీదికి తీసుకొచ్చింది. ఈ మేరకు పార్టీ బైలాస్లో మార్పులు చేయడానికి అవసరమైన అన్ని రకాల తీర్మానాలను కూడా సభ్యలు ఆమోదించారు. అలాగే ఉప ప్రధాన కార్యదర్శి పోస్టును కూడా కొత్తగా ఏర్పాటు చేసింది. ఉప ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేసే సర్వ హక్కులను కూడా ప్రధాన కార్యదర్శికి బదలాయించింది. తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామాలు, తీర్మానాలతో ఏఐఏడీఎంకేలో అంతర్గతంగా విప్లవాత్మక మార్పులకు తెర తీసినట్టయింది.

ఓపీఎస్ మద్దతుదారుల ఆందోళన..
పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ కొనసాగుతున్న సమయంలో- బయట పన్నీర్ సెల్వం మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కుర్చీలను గాల్లోకి విసిరేశారు. పళనిస్వామికి మద్దతుగా కట్టిన ఫెక్సీలు, బ్యానర్లను తగులబెట్టారు. కార్యాలయం తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. అనంతరం పార్టీ ముఖ ద్వారం వద్ద కూర్చుని నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈపీఎస్ ఫొటోలకు చెప్పుతో కొట్టారు. ఈ మార్పులకు పన్నీర్ సెల్వం వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నారు.

1972 నుంచీ ప్రధాన కార్యదర్శి పోస్టు ఖాళీ..
1972లో పార్టీ ఆవిర్భావం నుంచీ ప్రధాన కార్యదర్శి పోస్ట్ అనేది ఖాళీగా ఉంటూ వస్తోంది. దీన్ని భర్తీ చేసేలా బైలాస్లో మార్పులు చేయాలంటూ జనరల్ కౌన్సిల్ డిమాండ్ చేస్తోంది. అది ఇన్నాళ్లుగా కుదరలేదు. ఇప్పుడు అది సాధ్యపడింది. బైలాస్ మార్పులకు పార్టీ సర్వసభ్య సమావేశం ఆమోదించింది.












Click it and Unblock the Notifications