చిన్నమ్మ శపథం: జనవరి 27 ఆగమనం -శశికళ విడుదల ఖరారు -సుధాకరన్ ఔట్ -ఎన్నికల్లో రచ్చే
అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి, నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే బహిషృత నేత వీకే శశికళ విడుదలకు రంగం సిద్ధమైంది. జైలు జీవితాన్ని వీడి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు చిన్నమ్మకు మార్గం సుగమమైంది. ఏడాది జనవరి 27న ఆమె విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో శిక్ష అనుభవించిన శశికళ అక్క కొడుకు సుధాకరన్ ఇప్పటికే జరిమాన చెల్లించడంతో అతని విడుదలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శశికళ కంటే ముందుగానే సుధాకరన్.. ఇవాళో రేపో బయటికి వచ్చేయనున్నారు.

కోర్టులో హైడ్రామా..
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషులుగ తేలడంతో శశికళ, ఆమె వదిన ఇళవరసి, అక్క కుమారుడు సుధాకర్ 2017 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. వీరి శిక్షాకాలం 2017 ఫిబ్రవరితో ముగియనుంది. గతనెల 17న శశికళ తన జరిమానాను న్యాయవాది ద్వారా బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో చెల్లించారు. ఆ తరువాత ఇళవరసి సైతం జరిమానాను చెల్లించారు. వీఎన్ సుధాకరన్ మాత్రం జరిమానా చెల్లించకపోవడంతో గురువారం బెంగళూరు సివిల్ కోర్టులో హైడ్రామా నడిచింది. చివరికి రూ.10 కోట్ల జరిమానా సొమ్ము చెల్లించడంతో సుధాకరన్ విడుదలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు..

జనవరి 27న శశికళ విడుదల
అక్రమ ఆస్తుల కేసులో శిక్ష అనుభవించిన సుధాకరన్ విడుదలపై స్పష్టత రావడంతో అదే కేసుకు చెందిన శశికళకు సైతం జైలు నుంచి విముక్తి పొందే రోజు ఆసన్నమైనట్లు తెలుస్తోంది. విచారణ ఖైదీగా శశికళ గడిపిన జైల్లో గడిపిన రోజులను పరిగణనలోకి తీసుకుని వచ్చే ఏడాది జనవరి 27వ తేదీ రాత్రి 7 లేదా 9.30 గంటలకు శశికళ విడుదల ఖాయమని సమాచారం. తమిళనాడులో వచ్చే ఏడాది మేలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో శిశకళ విడుదలకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. ఆమె అడుగు బయటపెట్టిన వెంటనే.. మోస్ట్ పవర్ ఫుల్ ‘మన్నార్ గుడి మాఫియా' మళ్లీ జీవం పోసుకుంటుందని, ఈసారి ఎన్నికల్లో రచ్చ తప్పదనే చర్చ నడుస్తోంది. దీనికి సంకేతంగా..

కర్ణాటక సర్కారు సర్క్యులర్..
జైలు శిక్ష ముగియడం, రూ.10 కోట్ల జరిమానాను ఇప్పటికే చెల్లించి ఉండటంతో శశికళ విడుదలకు ఆటంకాలేవీ ఉండబోవని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లే జరిగిన వచ్చే ఏడాది జనవరి 27న ఆమె విడుదల కావడం ఖాయం. చిన్నమ్మ బెంగళూరులోని జైలు నుంచి బయటికి అడుగుపెట్టి, తమిళనాడులోకి వెళ్లేంతవరకు చేపట్టాల్సిన బందోబస్తు చర్యలపై కర్ణాటక ప్రభుత్వం గురువారం జారీ చేసిన సర్క్యులర్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం అధికారికంగా ధ్రువీకరణ కాలేదు. మరోవైపు,

దినకరన్ హడావుడి.. భారీ వెల్కమ్
శశికళ విడుదల వేళ ఆమె సమీపబంధువైన టీటీవీ దినకరన్ కు కొత్త రెక్కలు వచ్చినట్లయింది. అన్నాడీఎంకేలో ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయించి, సొంతగా ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం' పేరుతో పార్టీ పెట్టిన దినకరన్.. తన కార్యకర్తలతో కలిసి జనవరి 27న బెంగళూరు జైలు వద్దకు చేరుకుని శశికళ ఘనస్వాగతం పలికే అవకాశం ఉందని తెలుస్తోంది. బందోబస్తు చర్యల ప్రణాళికలో కర్ణాటక ప్రభుత్వం దినకరన్ హడావుడిపైనా అంచనా వేసింది. బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి తమిళనాడు సరిహద్దుకు ఆమె చేరే వరకు ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్శాఖకు కర్ణాటక ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసినట్లు సమాచారం.
Recommended Video

చిన్నమ్మ శపథం నెరవేరేనా?
జనవరి నెలాఖరులోగా శశికళ విడుదల ఖరారు కావడంతో తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. శశికళ జైలులో, దినకరన్ వేరు కుంపటి పెట్టిన వేళ అన్నాడీఎంకే దాదాపుగా బీజేపీకి బీ-టీమ్ లా తయారైన నేపథ్యంలో శశికళను తిరిగి పార్టీలోకి తీసుకుంటారా? లేక దినకరన్ పార్టీ ఏఎంఎంకేలో ఉంటూనే శశికళ చక్రం తిప్పబోతున్నారా? అనేది ఇంకొద్ది రోజుల్లో తేలిపోనుంది. జయలలిత బతికున్న రోజుల్లో నోరెత్తని రజనీకాంత్, కమల్ హాసన్ లు ఇప్పుడు రాజకీయ పార్టీలు పెట్టడం, డీఎంకే సైతం బలం పుంజుకున్న తరుణంలో చిన్నమ్మ రాక తమిళ రాజకీయాలను ఏ మలుపు తిప్పుదుందో చూడాలి. అక్రమాస్తుల కేసులో అరెస్టయి, చెన్నై నుంచి బెంగళూరుకు బయలుదేరే ముందు.. మెరీనా బీచ్ లోని జయలలిత సమాధిని సందర్శించిన శశికళ.. సమాధిపై మూడు సార్లు బలంగా కొట్టి, శపథం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జయలలిత ఆశయాలను కొనసాగిస్తానని, పార్టీని చీల్చాలని చూసేవారిని ఎన్నటికీ క్షమించబోనని, తమిళపీఠాన్ని కాపాడుకుంటామని ఎరుపెక్కిన కళ్లతో శశికళ చేసిన శపథం నెరవేరుతుందో లేదో కాలమే నిర్ణయిస్తుంది.












Click it and Unblock the Notifications