తమిళనాడు సీఎం కీలక నిర్ణయం: మరో నెలపాటు లాక్డౌన్ పొడిగింపు
చెన్నై: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మరికొన్ని సడలింపులిస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 31 వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. రాష్ట్రంలో శుక్రవారంతో లాక్డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో వైద్యాధికారులు, ఆరోగ్యశాఖ ముఖ్య అధికారులతో అత్యవసర భేటీ అయిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
కరోనా వార్డులో నకిలీ డాక్టర్ కలకలం: 4రోజులపాటు విధులు, మహిళ, ఆమె భర్త అరెస్ట్
ఆగస్టు నెలలోని అన్ని ఆదివారాల్లోనూ(ఆగస్టు 2, 9, 16, 23, 30తేదీల్లో) కఠినమైన ఆంక్షలతో కూడిన లాక్డౌన్ను అమలు చేయనున్నట్లు సీఎం పళనిస్వామి గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అన్ని కమర్షియల్, ప్రైవేటు సంస్థల్లో శ్రామిక శక్తిని 75 శాతం పెంచుకొనేందుకు వీలు కల్పించడంతోపాటు హోటళ్లు, రెస్టారెంట్లలో భోజన సర్వీసులను అందించేందుకు అనుమతులు ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుతామని వ్యాఖ్యానించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంతోపాటు పలు జాగ్రత్తలతో నిర్వహించనున్నట్లు తెలిపారు.
కంటైన్మెంట్ జోన్లలో మాత్రం అన్ని నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయని సీఎం పళనిస్వామి చెప్పారు. మతపరమైన సమావేశాలు, ప్రజారవాణా, షాపింగ్ మాల్స్, థియేటర్లు, బార్లు, రాజకీయ, క్రీడా సంబంధమైన కార్యకలాపాలపై నిషేధం యథాతథంగా కొనసాగుతుందని చెప్పారు. అంతేగాక, అంతర్రాష్ట్ర రవాణాపై నిషేధం కొనసాగనుందని సీఎం తెలిపారు.
కాగా తమిళనాడులో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,34,114 మంది కరోనా బారినపడ్డారు. 57,490 యాక్టివ్ కేసులున్నాయి. 1,72,883 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడి 3,741 మంది మరణించారు.