పొరుగు రాష్ట్రం అల్లకల్లోలం - స్కూళ్లు, కాలేజీలు బంద్..!!
చెన్నై: తమిళనాడును అతి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొన్ని గంటలకు ఏకధాటిగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. చెన్నై సహా దక్షిణ తమిళనాడులోని అనేక జిల్లాల్లో అసాధారణ వర్షపాతం నమోదైంది. ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందంటూ భారత వాతావరణ విభాగం అధికారులు హెచ్చరించారు. దీనితో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు ముందస్తు జాగ్రత్తలను తీసుకుంది.
బంగాళాఖాతం ఉపరితలంపై నైరుతి దిశగా ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రరూపం దాల్చింది. వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది. దీని ప్రభావంతో తమిళనాడు దక్షిణ ప్రాంతం వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తోన్నాయి. కొన్ని గంటలుగా ఇదే పరిస్థితి నెలకొందక్కడ. ఎడతెరిపి లేని వర్షాల వల్ల పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సముద్ర తీర ప్రాంతాలన్నీ అల్లకల్లోలంగా మారాయి.
ప్రధానంగా- చెన్నై, కాంచీపురం, రాణిపేట, రాయవేలూరు, తిరువళ్లూరు, విల్లుపురం, తిరువరూర్, మైలాడుదురై, నీలగిరి, థేని, కరూర్, పుదుక్కోట్టై, పెరంబలూరు, మధురై, అరియలూర్, తిరువణ్ణామలై, రామనాథపురం, కడలూరు, కాళ్లకురిచ్చి, దిండిగల్, కారైక్కాల్పై వర్ష ప్రభావం తీవ్రంగా ఉంటోంది. బలమైన ఈదురుగాలులు వీస్తోన్నాయి. చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటికి రావాలంటే జంకుతున్నారు.
ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించిన నేపథ్యంలో- తమిళనాడు ప్రభుత్వం పలు ముందస్తు జాగ్రత్తలను తీసుకుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించింది. వారి కోసం ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేసింది. మొత్తంగా 26 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. మొదట్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు మాత్రమే సెలవును ప్రకటించింది.
వర్షం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు కూడా సెలవు ఇచ్చింది. 14వ తేదీ వరకు బంగాళాఖాతం మధ్య- నైరుతి దిశగా దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య ప్రాంతం, లక్షద్వీప్, తమిళనాడు తీరాల మీదుగా గంటకు 40 నుంచి 45 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, అదే స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.