తమిళనాట మరో హిందీ వ్యతిరేక ఉద్యమం ? విద్యావిధానం అమలు కుదరదన్న పళనిస్వామి..
కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానం తమిళనాట మరో చిచ్చు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని తమిళనాడులో అధికార అన్నాడీఎంకేతో పాటు బీజేపీయేతర విపక్ష పార్టీలన్నీ వ్యతిరేకిస్తుండటమే ఇందుకు కారణం. తమిళ భాషకు వ్యతిరేకంగా ఉన్న జాతీయ విద్యావిధానం బాధాకరమని, దాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమంటూ సీఎం పళనిస్వామి ప్రకటించారు.
త్రిభాషా సిద్ధాంతం తమిళనాడులో గత ముఖ్యమంత్రులు అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత అనుసరించిన వైఖరినే తామూ అనుసరిస్తామని సీఎం పళనిస్వామి పేర్కొన్నారు. త్రిభాషా సిద్ధాంతం అమలుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని పళనిస్వామి ప్రధాని మోడీని కోరారు. 1965లో హిందీని అధికార భాషగా ప్రకటించేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు తమిళనాడులో చెలరేగిన హిందూ వ్యతిరేక ఆందోళలనను పళనిస్వామి గుర్తు చేశారు.

త్రిభాషా సిద్ధాంతం అమలుపై తమిళనాడు ప్రభుత్వం వ్యక్తం చేస్తున్న ఆందోళనలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ స్పందించారు. కేంద్రం ఏ భాషనూ రాష్ట్రాలపై రుద్దబోదని హామీ ఇచ్చారు. ఈ విషయంలో మాజీ కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ సూచనలు తీసుకునేందుకు సిద్దమని ఆయన పేర్కొన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.












Click it and Unblock the Notifications