రాళ్లు- సోడా బాటిళ్లు: వైసీపీ-టీడీపీ మధ్య ఘర్షణ- తీవ్ర ఉద్రిక్తత: 144 సెక్షన్
చిత్తూరు: చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రొంపిచెర్లలో రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ- తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం రాళ్లు, బీర్ బాటిళ్లను విసురుకున్నారు. సోడా బాటిళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన సందర్భంగా కార్యకర్తలను రెచ్చగొట్టడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తోన్నారు.
నాగబాబుకు మంత్రి రోజా దిమ్మతిరిగే కౌంటర్.. ఆ వీడియో క్లిప్పింగ్స్
వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, అటవీ-విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం.. పుంగనూరు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనియ్యనని, ఆయన గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ తన కుప్పం పర్యటన సందర్భంగా చంద్రబాబు సవాల్ విసిరిన విషయం తెలిసిందే.
దీని తరువాత పుంగనూరుకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులు, వైసీపీ నాయకులపై దాడులకు పాల్పడినట్లు చెబుతున్నారు. పట్టణంలో వైసీపీ నాయకులు కట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, లోక్ సభ సభ్యుడు మిథున్ రెడ్డిల ఫ్లెక్సీలు, బ్యానర్లను చింపేశారు. వారిని అడ్డుకోవడానికి పెద్దిరెడ్డి వర్గీయులు ప్రయత్నించడంతో ఘర్షణ వాతావరణం నెలకొందని తెలుస్తోంది.
రొంపిచెర్ల బస్టాండ్ సెంటర్ లో కట్టిన బ్యానర్లు, ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చింపేయడాన్ని ప్రతిఘటించారు వైసీపీ కార్యకర్తలు. దీనితో తొలుత ఈ రెండు వర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకుంది. అది కాస్తా చిలికి చిలికి గాలీవానగా మారింది. ఇరు పక్షాల వారు రాళ్లు రువ్వుకున్నారు. బీర్ బాటిళ్లను విసురుకున్నారు. సోడా బాటిళ్లతో దాడులకు దిగారు. పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేసినప్పటికీ వినిపించుకోలేదు.
దీనితో పోలీసులు రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ ను విధించారు. ఇరుపక్షాల వారిని చెదరగొట్టడానికి లాఠీ ఛార్జ్ చేశారు. దీనితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు. ఈ దాడులు- ప్రతిదాడుల్లో కొందరు కార్యకర్తలు గాయపడ్డారని, వారు స్థానిక ఆసుపత్రిలో వైద్య చికిత్సను తీసుకుంటోన్నట్లు తెలుస్తోంది.