Chittoorలో దారుణం: ప్రేమించట్లేదని నర్సు ప్రాణం తీశాడు..అదే కత్తితో గొంతుకోసుకున్నాడు
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను అంగీకరించట్లేదనే కారణంతో ఓ యువకుడు ఉన్మాదిగా మారాడు. యువతిపై కత్తితో దాడి చేశాడు. పొడిచి చంపాడు. అనంతరం అదే కత్తితో తాను ఆత్మహత్యాయత్నం చేశాడు. అదే కత్తితో గొంతు కోసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు..కొస ప్రాణాలతో ఉన్న ఆ యువకుడిపై దాడి చేయడంతో మరణించాడు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టమ్ కోసం తరలించారు.
Anantapur: 500 పడకల జర్మన్ హ్యాంగర్ కోవిడ్ ఆసుపత్రి: ప్రారంభించిన వైఎస్ జగన్
మృతుల పేర్లు సుష్మిత, చిన్నాగా గుర్తించారు. వారిద్దరూ ఒకే గ్రామస్తులు. చిత్తూరు రూరల్ మండలం పరిధిలోని సాంబయ్య కండ్రిగలో నివాసం ఉండేవారు. సుష్మిత చిత్తూరులోని సీఎంసీ ఆసుపత్రిలో ఏఎన్ఎంగా పని చేస్తోన్నారు. అదే గ్రామానికి చెందిన చిన్నప్ప అలియాస్ చిన్నా.. స్థానికంగా ఓ గ్రానైట్ ఇండస్ట్రీలో కార్మికుడు. కొద్దిరోజులుగా అతను ప్రేమ పేరుతో సుష్మితను వేధింపులకు గురి చేస్తుండేవాడు. అతని ప్రపోజల్స్ను సుష్మిత అంగీకరించలేదు. సుష్మిత కుటుంబ సభ్యులు ఆమెకు సంబంధాలు చూడసాగారు.
ఈ విషయం తెలుసుకున్న చిన్న సుష్మితను హత్య చేయాలని పథకం పన్నాడు. ఈ ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్న సుష్మితపై కత్తితో దాడి చేశాడు. ఇష్టానుసారంగా పొడిచాడు. దీనితో ఆమె అక్కడికక్కడే మరణించారు. ఈ విషయం బయటికి తెలిస్తే.. తనను కొట్టి చంపేస్తారనే భయంతో చిన్నా.. అదే కత్తితో గొంతుకోసుకున్నాడు. సుష్మిత ఇంటి వద్దే స్పృహ తప్పాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు సుష్మిత ఇంటికి చేరుకున్నారు. స్పృహ తప్పిన స్థితిలో పడి ఉన్న చిన్నాను తీవ్రంగా కొట్టారు. దీనితో అతను మరణించాడు.
సమాచారం అందిన వెంటనే చిత్తూరు వన్టౌన్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్మార్టమ్ కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుష్మిత కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆమె పనిచేస్తోన్న ఆసుపత్రి డాక్టర్లు, తోటి నర్సులు సంతాపం తెలిపారు.