జడ్జీ భూమిని వదల్లేదు.. మంత్రి అనుచరుల కబ్జా..? ఎన్కౌంటర్ చేస్తానని పోలీసుల బెదిరింపులు..?
ఆంధ్రప్రదేశ్లో దళిత జడ్జీలకు కూడా రక్షణ లేకుండా పోయింది. పాలకులకు సెల్యూట్ చేస్తోన్న పోలీసులు.. తమ మాట వినని వారిపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. ఇటీవల దళితులపై దాడులు జరుగుతోన్న క్రమంలో.. అదే సామాజికవర్గానికి చెందిన జడ్జీని కూడా వేధించడం సంచలనం సృష్టిస్తోంది. తన తమ్ముడిని స్టేషన్లో బంధించి.. ఎన్ కౌంటర్ చేస్తానని ఓ మీడియా ప్రతినిధితో సదరు జడ్జీ వాపోయారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా.. అదేం లేదని.. మరో కట్టుకథ అల్లి చెప్పారు.

దళిత జడ్జీ భూమి కబ్జా..?
చిత్తూరు జిల్లా బి కొత్తకోటలో తన ఇంటి పక్క ఉన్న భూమిని కబ్జా చేయడానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ప్రయత్నించారని దళిత జడ్జీ ఎస్ రామకృష్ణ ఆరోపించారు. ఘటనపై ఫిర్యాదు చేసేందుకు తన తమ్ముడు డాక్యుమెంట్లతో సహా స్టేషన్కు వెళ్లాడని తెలిపారు. వాటిని పక్కనపెట్టే.. మీ అన్న ఎక్కడున్నాడని ఎస్సై స్టేషన్లో నిర్బంధించాడని వాపోయారు. అంతేకాదు ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారని తెలిపారు. భూమి యాజమాని మీ అన్న అయినందున.. ఆయన్నే రావాలని.. లేదంటే నీపై కేసు పెడతామని బెదరించారని తెలిపారు. ఘటనపై ఎస్పీ, డీఐజీకి ఫోన్చేశానని జడ్జీ రామకృష్ణ తెలిపారు. వారు ఏం కాదు ఇంటికెళ్లిపోవాలని తమ్ముడికి చెప్పారని వివరించారు.

ఫోన్ చేస్తే తీయలేదు.. కక్షగట్టి మరీ..
హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్రణ-పర్యవేక్షణ కమిషన్ చైర్మన్, జస్టిస్ ఈశ్వరయ్య శనివారం తనకు ఫోన్ చేశారని, తీయనందుకు కక్ష గట్టారని రామకృష్ణ ఆరోపించారు. ఎస్సై తనను, కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని తెలిపారు. అంతేకాదు తన ఫోన్కు బగ్ పెట్టారని, దాంతో ఎస్పీ, డీఐజీతో మాట్లాడే సమయంలో ఫోన్ హ్యాంగ్ అయ్యిందని వివరించారు. తన భూమిని కబ్జా చేస్తున్నారని, చుట్టూ బండలు వేస్తున్నారని వాపోయారు. వారు మంత్రి పెద్దిరెడ్డి మనుషులని పేర్కొన్నారు. వారి నుంచి తన భూమి కాపాడాల్సిన పోలీసులు.. వారికి సపోర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.

ఒకటిన్నర ఎకరం భూమి వివాదం..
2012లో తాను ఒకటిన్నర ఎకరం భూమి కొన్నానని రామకృష్ణ తెలిపారు. ఆ భూమి తమదని కొందరు గొడవకు దిగారని, దాంతో డబ్బులిచ్చి కొంత భాగం రిజిస్టర్ చేయించానని వివరించారు. నాగరాజు అనే వ్యక్తి మోసం చేసి భూమిని అంటగట్టారని వెల్లడించారు. పైగా ఇప్పుడు అతనే గొడవ చేయిస్తున్నాడని ఆరోపించారు. భూమికి సంబంధించి సివిల్ కేసులు కూడా ఉన్నాయని తెలిపారు. మరీ సివిల్ కేసులో ఎస్సై ఎలా తలదూర్చుతున్నాడో అర్థం కావడం లేదన్నారు.

అక్రమంగా లాకప్లో ఉంచి..
తన తమ్ముడిని అరెస్టు చేస్తే ఎఫ్ఐఆర్ ఉండాలి.. అలా చేయలేదు కానీ, అక్రమంగా లాక్పలో ఉంచారని రామకృష్ణ తెలిపారు. ఘటనపై మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి స్పందించారు. జడ్జీ రామకృష్ణ నివాసం పక్కన గల భూమిని లీజుకు తీసుకున్నట్టు చెబుతున్న మహిళ, ఆ భూమిలో ప్రవేశించేందుకు ప్రయత్నించగా రామకృష్ణ తమ్ముడు రామచంద్ర అడ్డుకుని దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీనిపై మహిళ 100కు ఫిర్యాదు చేశారని తెలిపారు. దానిపై బి కొత్తకోట ఎస్సై సునీల్కుమార్ కేసు నమోదు చేశారని తెలిపారు. విచారణ కోసం రామచంద్రను పీఎస్కు పిలిపించారని చెప్పారు.

డాక్యుమెంట్లు చూసి.. పంపించాం..
రామచంద్ర తీసుకొచ్చిన డాక్యుమెంట్లు పరిశీలించి పంపించివేసినట్లు వివరించారు. ఇంటికెళ్లిన రామచంద్ర కాసేపటికే తిరిగి స్టేషన్కు వచ్చి బలవంతంగా కూర్చుండారని తెలిపారు. వెళ్లిపోవాలని ఎస్సై, సిబ్బంది చెప్పినా వినిపించుకోలేదన్నారు. దీనిపై వస్తున్న ఆరోపణలు సత్యదూరం అని పేర్కొన్నారు. మహిళ చేసిన ఫిర్యాదుపై విచారించడానికి రామచంద్రను పిలిపించాం తప్ప.. లాకప్లో కూర్చోబెట్టలేదని తెలిపారు.












Click it and Unblock the Notifications