మహేష్ ప్రేమలో లోకేష్: అమ్మాయిగా మారితే పెళ్లి.. ఆపై మోసం; ఇదో వింత కథ!!
ఎక్కడైనా అబ్బాయి అమ్మాయిల మధ్య స్నేహం ప్రేమగా మారుతుంది. వారు ఒకరికొకరుగా కలిసి జీవనం సాగించాలని నిర్ణయించుకుంటారు. కానీ చదువుకునే రోజుల్లో ఇద్దరు అబ్బాయిల మధ్య ఏర్పడిన పరిచయం కాస్త స్నేహంగా మారి, వారిద్దరు భార్యాభర్తలు కావాలని నిర్ణయించుకోవడం ఒక అసహజ నిర్ణయం. అయితే ఇద్దరు అబ్బాయిలు భార్యాభర్తలుగా ఉంటే కలిసి జీవించలేమని అందులో ఒకరు అమ్మాయిగా మారి పెళ్లి చేసుకోవాలని రెడీ అయ్యారు. అంతలోనే అమ్మాయిగా మారిన అబ్బాయికి, సదరు ప్రేమించిన అబ్బాయి ఊహించని షాక్ ఇచ్చాడు. చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే
చిత్తూరు జిల్లాలోని నిమ్మనపల్లె మండలం వెంగం వారి పల్లెకు చెందిన లోకేష్ గతంలో మదనపల్లి లో ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో లోకేష్ కు మహేష్ అనే మరో యువకుడు పరిచయమయ్యాడు. దీంతో లోకేష్ మహేష్ ప్రేమలో పడ్డాడు. ఇద్దరు కలిసి ఒకరిని వదిలి ఒకరు ఉండలేమని నిర్ణయించుకున్నారు. పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా కలిసి జీవితం సాగించాలని భావించారు. ఈ క్రమంలోనే మహేష్ లోకేష్ ను అమ్మాయిగా మారాలని కోరాడు.
దీంతో లోకేష్ తన పేరును స్వీటుగా మార్చేసుకుని అమ్మాయి గా మారాడు. ఆరు సంవత్సరాలుగా ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. సహజీవనం చేసిన ప్రియుడు తనను పెళ్లి చేసుకుంటాడని లోకేష్ భావించాడు. కానీ మహేష్ లోకేష్ కు ఊహించని షాక్ ఇచ్చాడు. తనకు పిల్లలు కావాలని, అందుకు మరో పెళ్లి చేసుకుంటానని స్వీటీకి మహేష్ చెప్పడంతో స్వీటీ గా ఉన్న లోకేష్ లబోదిబోమని విలపిస్తున్నాడు. తనను మోసం చేశాడని మహేష్ పై ఆరోపణలు చేస్తున్నాడు.
తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు, మెసేజ్ లను మహేష్ తన ఫోన్ నుండి డిలీట్ చేశాడని ఆరోపిస్తున్నాడు. ఇక మదనపల్లె రూరల్ పోలీసులను ఆశ్రయించిన లోకేష్ అలియాస్ స్వీటీ తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. ఇంతకాలం తనతో సహజీవనం చేసిన ప్రియుడితో తన పెళ్లి జరిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.