రైతుల ముసుగులో టీడీపీ గూండాలే పిన్నెల్లిపై దాడి .. చూస్తూ ఊరుకోం .. రోజా వార్నింగ్
నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుది అవినీతి సామ్రాజ్యం అన్నారు. కావాలని రాజధాని రైతుల ముసుగులో అరాచకాలకు పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు . గుంటూరు జిల్లా చినకాకానిలో ప్రభుత్వ విప్, వైపీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై జరిగిన దాడిపై ఆమె మండిపడ్డారు . ఆయనపై రైతులు దాడి చేయలేదని, టీడీపీ కార్యకర్తలే హత్యాయత్నం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే రోజా .

టీడీపీతో వైసీపీ ప్రజాప్రతినిధులకు ప్రాణహాని ఉందన్న రోజా
ప్రజాప్రతినిధులను భయభ్రాంతులకు గురి చేసే కుట్ర జరుగుతుందని, ప్రాణ హాని ఉందని పేర్కొన్న రోజా జగన్ మోహన్ రెడ్డి తక్షణం ఇలాంటి అరాచక శక్తులపై చర్యలకు ఆదేశించాలని ఆమె సీఎం జగన్ ను విజ్ఞప్తి చేశారు. కారుకు అన్ని రంధ్రాలు పడ్డాయంటే ఎంత బలంగా కొట్టారో అర్ధమవుతోందని రోజా పేర్కొన్నారు. అంతే కాదు ఆయన్ను చంపేందుకు కుట్ర చేశారని మండిపడ్డారు రోజా. అల్లర్లు సృష్టించటం, అరాచకాలు చెయ్యటం, వాటిని రాజకీయ లబ్ది కోసం వాడుకోవటం చంద్రబాబుకు అలవాటన్నారు రోజా .

అల్లర్లు, అరాచకాలు.. రాజకీయ లబ్ధి కి వాడుకోవడం చంద్రబాబుకు అలవాటు
ఎన్టీఆర్ మీద చెప్పులు, రాళ్లు వేసి ఆయన జీవితాన్ని సర్వనాశనం చేశారని పేర్కొన్నారు రోజా. పరిటాల హత్యను క్యాష్ చేసుకునేందుకు అల్లర్లు సృష్టించారని ఆరోపించారు. అల్లర్లు, అరాచకాలు సృష్టించి రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని విరుచుకుపడ్డారు రోజా.ఏపీ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. ఏదైనా అభ్యంతరం ఉంటె అసెంబ్లీ వేదికగా మాట్లాడొచ్చు అన్న రోజా, జగన్ మోహన్ రెడ్డి 13 జిల్లాలకు న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకోటానికి టీడీపీ నేతల ఆందోళన
రాష్ట్రం విడిపోకూడదని గతంలో ఎంతో ప్రయత్నించారు. కానీ చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారని ఇప్పుడు ఏపీ పరిస్థితికి చంద్రబాబే కారణం అని ఆమె దుయ్యబట్టారు. ఇప్పుడు అమరావతి కోసం ఆందోళనలు చేస్తుంది రైతులు కాదని, తమ అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకోటానికి టీడీపీ నేతలు ఆందోళన పేరుతో అరాచకాలు సృష్టిస్తున్నారని, మీడియాపై దాడులు , ప్రజా ప్రతినిధులపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రోజా పేర్కొన్నారు.

ఆందోళనలు చేస్తుంది రైతులు కాదు.. టీడీపీ రౌడీలు
ఇప్పుడు అమరావతిలో గొడవలు సృష్టించి మూడు ప్రాంతాలకు విడదీసేందుకు, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న రోజా రైతుల ముసుగులో ఉన్న రౌడీలు, గూండాలతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై దాడి చేశారని ఆరోపించారు. మరి మూడు రాజధానుల స్వాగతించిన గంటా శ్రీనివాసరావు, కేఈ కృష్ణమూర్తిపై ఎందుకు రాళ్ల దాడి జరగలేదు? అని ప్రశ్నించిన రోజా ఇదంతా చంద్రబాబు ప్లాన్లో భాగంగానే జరుగుతోంది అని పేర్కొన్నారు.

పర్యవసానాలను టీడీపీ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించిన రోజా
వైసీపీ ఎమ్మెల్యేలపై దాడి చేయాల్సిన అవసరం అమరావతి రైతులకు లేదని ఇదంతా చేస్తుంది టీడీపీనే అన్న రోజా దీని పర్యవసానాలను టీడీపీ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
తన భూములు, తన బినామీ భూములను కాపాడుకోవాడనికి టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారిపోయారని ఆమె ఎద్దేవా చేశారు. తన భార్యను కూడా తీసుకొచ్చి అమరావతి రైతుల మధ్య కూర్చోబెట్టారని ,ఆమె చేత రెండు బంగారు గాజులను విరాళం ఇప్పించడాన్ని చూసి జనాలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications