మేమూ పంచుతాం - జగన్ను మించి పంచుతాం: చంద్రబాబు ఉచిత హామీల సునామీ
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఉచిత పథకాల మీద స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోన్న నవరత్నాలు పథకాల గురించి మాట్లాడారు. ప్రజలకు డబ్బులను పంచుతున్నాడంటూ వైఎస్ జగన్ మీద ఆరోపణలు, విమర్శలను గుప్పిస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు అదే బాటలో తామూ నడుస్తామని కుండబద్దలు కొట్టారు.

విస్తృత పర్యటన..
ప్రస్తుతం చంద్రబాబు- చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఇవ్వాళ మూడోరోజు పర్యటన. నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటిస్తోన్నారు. ప్రజలను కలుసుకుంటోన్నారు. కుప్పం టౌన్, గుడుపల్లి మండలాల్లో ఆయన పర్యటన కొనసాగుతోంది. ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్ దగ్గర ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కుప్పం మోడల్ కాలనీ, కృష్ణదాసనపల్లి, జరుగు, గుడ్లనాయనపల్లి గ్రామాల్లో ప్రజలతో మమేకం అవుతున్నారు.

వైసీపీకి భవిష్యత్ లేదు..
ఈ సందర్భంగా ఆయన ప్రజలపై హామీల వెల్లువను కురిపిస్తోన్నారు. తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాల గురించి ఏకరువు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది తామేనని స్పష్టం చేస్తోన్నారు చంద్రబాబు. వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులను కూడా గెలవబోతోన్నామని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ భవిష్యత్ లేదని, ఇక రాబోయే కాలం అంతా టీడీపీదేనని అన్నారు.

పులివెందులను గెలుస్తాం..
తాను కుప్పంలో ఓడిపోతానంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రచారం చేస్తోన్నారని, అది సాధ్యపడుతుందా? అని ప్రశ్నించారు. కుప్పం ప్రజలు తనను గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు. కుప్పంలో తాను ఓడిపోవడం అనేది జరగదని స్పష్టం చేశారు. తాము మాత్రం పులివెందులలో తెలుగుదేశం జెండా పాతుతామని చంద్రబాబు అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న పుంగనూరును కూడా సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

నవరత్నాలకు మించి పథకాలు..
తాము అధికారంలోకి వస్తే- నవరత్నాలను మించిన పథకాలను అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాంటి హామీలను మేనిఫెస్టోలో కూడా పొందుపరుస్తామని చెప్పారు. అన్ని సామాజిక వర్గాలను ఆదుకునేలా తమ ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని అన్నారు. నవరత్నాల పేరుతో జగన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తోన్నారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ నాయకుల దౌర్జన్యాలకు ఇకపై చెల్లుబాటు కావని హెచ్చరించారు. తాను కుప్పంలోనే ఉంటాననీ భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications