చిత్తూరు మదనపల్లెలో భారీ అగ్నిప్రమాదం... ప్రదీప్ ట్రేడర్స్ భవనంలో ఎగసిపడుతున్న మంటలు...
చిత్తూరు జిల్లా మదనపల్లెలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం(ఫిబ్రవరి 8) తెల్లవారుజామున స్థానిక అప్పారావు వీధిలోని ప్రదీప్ ట్రేడర్స్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు భారీగా ఎగసిపడటంతో సిబ్బంది భయభ్రాంతులకు గురై పరుగులు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై స్థానికులు అగ్నిమాక సిబ్బందికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది అక్కడ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానికంగా ప్రదీప్ ట్రేడర్స్కు అతిపెద్ద వ్యాపార సముదాయ భవనంగా గుర్తింపు ఉంది. ఈ ప్రమాదంతో ప్రదీప్ ట్రేడర్స్కు కోట్ల రూపాయాల నష్టం వాటిల్లి ఉండొచ్చునని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఆదివారం(ఫిబ్రవరి) హైదరాబాద్లోనూ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా వద్ద ఓ వస్త్ర దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. యజమానులు షాపులు మూసివేసి ఇళ్లకు వెళ్లిపోయిన తర్వాత ఈ ఘటన జరిగింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఆయా షాపుల్లోని వస్త్రాలు కాలిబూడిదవడంతో... షాపుల యజమానుల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అటు దేశ రాజధాని ఢిల్లీలోనూ రెండు రోజుల క్రితం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం(ఫిబ్రవరి 6) అర్ధరాత్రి ఢిల్లీలోని ఓఖ్లా పారిశ్రామిక ప్రాంతంలోని ఓ కాలనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం... ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో... 27 ఫైరింజన్లతో రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.ఇందుకోసం కొన్ని గంటల పాటు శ్రమించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.