కుప్పంపై అంత కాన్ఫిడెంట్ ఎందుకు..?
చిత్తూరు: ఏపీ మ్యాప్ చిట్టచివరన.. ఓ మూలలో కనిపించే కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం- ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను తనవైపు తిప్పుకొంది. 2024 నాటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఫలితాల కోసం కోట్లాదిమంది ప్రజలను అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూసేలా చేసే సామర్థ్యం ఈ నియోజకవర్గానికి ఉంది. దీనికి ప్రధాన కారణం- ఏకచ్ఛత్రాధిపత్యాన్ని వహిస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ సారి ఇక్కడ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోన్నారంటూ వస్తోన్న వార్తలే.
జగన్ పర్యటనతో
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కిందటి నెల 23వ తేదీన కుప్పంలో పర్యటించిన అనంతరం అక్కడి సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అంచనాలకు అందని పరిస్థితులు ఏర్పడ్డాయి. వైఎస్ఆర్సీపీకి అనుకూల వాతావరణం ఏర్పడిందనే అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తం అయ్యాయి. అంతకుముందే చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. మూడు-నాలుగు రోజుల పాటు అక్కడే మకాం వేశారు.
టీడీపీలో ధీమా..
చంద్రబాబు మరోసారి కుప్పం గెలుస్తారంటూ టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తోన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు ఏ స్థాయిలో అభివృద్ధి అక్కడి ఓటర్లకు బాగా తెలుసంటూ స్పష్టం చేస్తోన్నారు. వైఎస్ జగన్ను గానీ, వైఎస్ఆర్సీపీ నాయకులను గానీ కుప్పం ఓటర్లు నమ్మే పరిస్థితి లేదనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తోన్నారు. ఎప్పట్లాగానే చంద్రబాబే కుప్పం కింగ్ అవుతారనీ జోస్యం చెబుతున్నారు టీడీపీ జిల్లా నాయకులు.
గట్టిగా కొడతామంటూ..
వైఎస్ఆర్సీపీలో దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. 2024లో కుప్పం నియోజకవర్గాన్ని కొట్టబోతోన్నామంటూ అటు వైఎస్ఆర్సీపీ నాయకులు సైతం ధీమా వ్యక్తం చేస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ స్థానంపై గెలిచే విషయంలో ఏ పార్టీకి ఆ పార్టీ సవాళ్లు- ప్రతిసవాళ్లు సైతం విసురుకున్నారు. రాజకీయ సన్యానం, రాజీనామాల వరకూ వెళ్లింది ఈ రెండు పార్టీల నాయకుల మధ్య చోటు చేసుకున్న వాగ్వివాదం.
మరిన్ని చేరికలు..
వైఎస్ఆర్సీపీ నాయకులు ఆత్మవిశ్వాసంతో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కుప్పం నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉండటం అదనపు బలాన్ని ఇచ్చినట్టయింది. టీడీపీ బలంగా ఉన్న మండలాల్లో ఒకటైన గుడుపల్లి నుంచి భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు వైఎస్ఆర్సీపీలో చేరారు. విద్యుత్, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కుప్పం ఇన్ఛార్జ్ కేఆర్జే భరత్ సమక్షంలో వారు వైసీపీ కండువాలను కప్పుకొన్నారు.
జెండా ఎగరడం ఖాయం..
మునిస్పల్, పంచాయతీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయఢంకా మోగించిన నేపథ్యంలో చంద్రబాబు కంచుకోట బద్దలు కావడం తథ్యమంటూ టీడీపీ నాయకులే చెబుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. వైఎస్ జగన్ పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు వారిని తమ పార్టీ వైపు ఆకర్షితులను చేస్తోన్నాయని చెప్పారు. ఇక కుప్పంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని తేల్చేశారు.
కుప్పం దోపిడీ..
ఎన్నో ఏళ్లుగా కుప్పం ప్రజలు దోపిడీకి గురవుతున్నారని, ఈ సారి భరత్ను ఎమ్మెల్యేగా గెలిపించి కుప్పంలో పార్టీ జండా ఎగరేయాలని ఆయన వారికి సూచించారు. వైసీపీ బలం రోజురోజుకూ పెరుగుతోందని, ప్రభుత్వ పథకాల లబ్దిని అనేకమంది టీడీపీ నాయకులు కూడా అందుకుంటున్నారని చెప్పారు. కుప్పంలో ఇదివరకెప్పుడూ లేనంత అభివృద్ధి తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని భరత్ పేర్కొన్నారు. టీడీపీలో సుదీర్ఘకాలం పని చేసిన అనుభవం ఉన్న వైసీపీలో చేరడంతోనే సగం విజయం సాధించినట్టయిందని వ్యాఖ్యానించారు.