టీటీడీ సూట్కేసు కంపెనీ కాదు.. కోట్లాది మంది దైవం, నమ్మకం: వైవీపై నారా లోకేశ్ ఫైర్
వేసవి సెలవులు.. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గడం.. ఇంకేముంది దర్శనాల కోసం భక్తులు బారులుతీరుతున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అయితే సర్వదర్శనం టోకెన్లు జారీచేసే సమయంలో తొక్కిసలాట జరిగింది. కొందరు గాయపడగా.. వారిని రుయా ఆస్పత్రికి తరలించారు. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలం అయ్యారని ఫైర్ అవుతున్నారు. ఎందుకీ ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.

భక్తుల ఇబ్బందులు..
సర్వదర్శనం టోకెన్ల జారీ సమయంలో శ్రీవారి భక్తులు ఇబ్బంది పడ్డారు. ఎండలో మహిళలు, వృద్ధులు, పిల్లలు ఇబ్బందికి గురయ్యారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరగగా కొందరు గాయపడ్డారు. అయితే వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై మండిపడ్డారు. భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశాన్ని ఇలాగే వ్యవహరిస్తారా అని అడిగారు.

సుట్ కేసు కంపెనీ కాదు
వైవీ సుబ్బారెడ్డిపై లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లాభాలు, జే ట్యాక్స్ లెక్కలు వేసుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం క్విడ్ ప్రోకో ద్వారా దోచుకున్న లక్షల కోట్లతో పెట్టుకున్న సూట్ కేసు కంపెనీ కాదని మండిపడ్డారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం, నమ్మకం అని చెప్పారు. సర్వదర్శనం టోకెన్ల జారీలో నెలకొన్న గందరగోళం, పంపిణీలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు గాయపడ్డారు. అయినా స్పందించరా? అని ఫైరయ్యారు. మండుటెండలో టోకెన్ల కోసం చిన్నపిల్లలు, వృద్ధులను ఇబ్బందికి గురిచేయడం న్యాయమేనా? అంటూ ప్రశ్నించారు.
దానిపై మాత్రం ఇంట్రెస్ట్
శ్రీవారి సేవలు, టికెట్లు, ప్రసాదం రేట్లు మూడింతలు పెంచడంపై ఇంట్రెస్ట్ ఉంది అని లోకేశ్ ఫైరయ్యారు. మరీ భక్తుల కనీస సౌకర్యాలు కల్పించడంలో లేదా అని అడిగారు. టీటీడీ వీఐపీల సేవలో తరిస్తోందని విమర్శించారు. సామాన్యులు ఇబ్బంది పడుతున్న పట్టించుకోకపోవడం మంచి పద్దతి కాదని నారా లోకేశ్ అన్నారు. భక్తులకు కావాల్సిన కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉందని గుర్తుచేశారు.

కారణమిదే
గత రెండు రోజులుగా అలిపిరి రెండో సత్రం వద్ద శ్రీవారి టోకెన్లు నిలిపివేయడం... అప్పటికే అక్కడ వేచి ఉన్న భక్తులకు తోడు ఇవాళ రద్దీ మరింత పెరగడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఇది తొక్కిసలాటకు దారితీయడంతో పలువురు భక్తులు గాయపడ్డారు. కొంతమంది భక్తులు బారికేడ్లను దాటుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఎండ వేడిమి... తొక్కిసలాటతో క్యూ లైన్లో నిలబడిన మహిళలు సొమ్మసిల్లిపోయారు. దాహం అని మహిళలు, పిల్లలు అల్లాడిపోయారు.

తర్వాత తేరుకున్న టీటీడీ
ఆ తర్వాత టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టోకెన్లు లేకుండా భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నామని ప్రకటించింది. భక్తుల రద్దీ తగ్గేవరకూ టోకెన్లు లేకుండా నేరుగా దర్శనానికి అనుమతిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 17 వరకు వీఐపీ దర్శనాలను రద్దు చేశామని వివరించింది. టీటీడీ తాజా నిర్ణయం పట్ల భక్తులు స్వాగతించారు. ఈ నిర్ణయం ముందే తీసుకుని ఉంటే తొక్కిసలాట జరిగి ఉండేది కాదని కొందరు అంటున్నారు.












Click it and Unblock the Notifications