MLA Roja ఏమైంది? ఆసుపత్రిలో చేరిన వైసీపీ ఫైర్బ్రాండ్: రెండు సర్జరీలు
చిత్తూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా అనారోగ్యానికి గురయ్యారు. ఆమె చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతున్నారు. ఆమెకు రెండు సర్జరీలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రోజా ఆరోగ్య పరిస్థితి బాగుందని ఆమె భర్త సెల్వమణి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియా ప్రతినిధులకు ఓ ఆడియో టేప్ను విడుదల చేశారు. ఆమె ఆరోగ్యం గురించి అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని సూచించారు.
చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గానికి రోజా ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. చాలాకాలంగా అక్కడే ఉంటున్నారు. మొన్నటి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి విస్తృతంగా పర్యటించారు. ఆమె నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నగరి, పుత్తూరు మున్సిపాలిటీల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె అలసట, కొంత అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది. దీనితో- చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.
ఆసుపత్రి డాక్టర్లు రోజాకు రెండు సర్జరీలను నిర్వహించారని సెల్వమణి చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగుందని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి సాధారణ వార్డుకు తరలించారని చెప్పారు. రోజా కోలుకుంటున్నారని వివరించారు. రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని డాక్టర్లు తెలిపినట్లు చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్నందున డాక్టర్లు కోవిడ్ ప్రొటోకాల్ను కఠినంగా అనుసరిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో రోజాను పరామర్శించడానికి అభిమానులు ఎవరూ చెన్నైకి రావొద్దని సెల్వమణి విజ్ఞప్తి చేశారు.
డాక్టర్లు సూచించిన విధంగా రెండు నుంచి మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆమె మళ్లీ ప్రజలతో మమేకం అవుతారని, పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు వైసీపీ సీనియర్ నాయకులు సెల్వమణికి ఫోన్ చేసి, రోజా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అకాంక్షించారు.