మంత్రి వర్సస్ ఎమ్మెల్యే -తప్పులు ఎంచుతూ : గోదావరిలో కొత్త వివాదాలు..!!
అధికార పార్టీ నేతల మధ్యమ డైలాగ్ వార్. ప్రజాప్రతినిధుల సమక్షంలోనే ఒకరి పై మరొకరు ఘాటు వ్యాఖ్యలు. తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సమావేశంలో వైసీపీ నేతల మధ్య జరిగిన చర్చ వాడీవేడిగా సాగింది. మంత్రి వేణు..ఎమ్మెల్యే చంటిబాబు మధ్య జరిగిన వాదన పార్టీలో చర్చకు కారణమైంది. తాము చట్టాల ప్రకారమే పని చేస్తున్నామని మంత్రి చెప్పటం.. అందుకు స్పందనగా తప్పులు కప్పి పుచ్చుకోవటం సరి కాదంటూ ఎమ్మెల్యే చంటిబాబు స్పందించటం ఈ వివాదానికి కారణమైంది. జిల్లా పరిషత్ సమావేశంలో రైతు భరోసా పైన చర్చ జరిగింది.
రైతులకు కులాలేంటి
జిల్లాలో దాదాపుగా 80 శాతం పైనా కౌలు రైతులే భూములు సాగు చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యేలు సమావేశంలో ప్రస్తావించారు. వారికి సీసీఆర్సీ కార్డులు లేనందున ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేకపోతున్నారని చెప్పుకొచ్చారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ విషయం పైన సమావేశంలో మాట్లాడారు. హక్కుపత్రాలు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదని, అందుకే కౌలుదారులు నష్టపోయినా పరిహారం రావడం లేదని ఆ ఇద్దరు నేతలు వివరించారు. దీనికి స్పందించిన మంత్రి వేణు దీనిపై ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. ఓసీలకు సీసీఆర్సీ కార్డులు ఇవ్వడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలురైతులకు ఇస్తున్న రైతుభరోసా సొమ్ము.. ఓసీలకు ఎందుకివ్వరని ప్రశ్నించారు.
చంటిబాబు నాట్ రైట్...
రైతులకు కులమేంటని ఎమ్మెల్సీ త్రిమూర్తులు నిలదీసారు. అదే సమయంలో జడ్పీటీసీ సభ్యులు తమ సభ్యులను ఏకరువు పెట్టారు. స్వాతంత్య్ర వేడుకల్లో తమకు కనీస ప్రొటోకాల్ పాటించలేదని ఫిర్యాదు చేసారు. మండల కార్యాలయాల్లో ఛాంబర్లు, కుర్చీలు కూడా లేవని చెప్పుకొచ్చారు. రోడ్లు చూస్తే తమకే సిగ్గేస్తోందని, ప్రజలకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. దీంతో.. వారికి మద్దతుగా ఎమ్మెల్యే చంటిబాబు మాట్లాడే సమయంలో మరోసారి మంత్రితో వాగ్వాదం చోటు చేసుకుంది. చంటిబాబూ నాట్ రైట్.. నువ్వు సమావేశం నడుపుతానంటే పైకొచ్చి నడుపు. ప్రతి విషయంలోనూ అడ్డురావొద్దంటూ మంత్రి వేణు అసహనం వ్యక్తం చేసారు.
మంత్రి వర్సస్ ఎమ్మెల్యే
ఏంటి గట్టిగా మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించిన ఎమ్మెల్యేల సమావేశం నడపమంటే నడుపుతామంటూ సమాధానం ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం పార్టీ మార్పు చేసిన వ్యాఖ్యలు సైతం అప్పట్లో భారీ స్థాయిలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా జిల్లా సమీక్షా సమావేశంలో ఒకే పార్టీకి చెందిన మంత్రి - ఎమ్మెల్యే మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం రాష్ట్ర పార్టీ నేతల వరకు చేరింది. దీని పైన సమాచారం సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. రానున్న ఎన్నికలకు సిద్దం అవుతున్న సమయంలో.. కీలకమైన తూర్పు గోదావరి జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య సాగుతున్న వ్యవహారం పార్టీ శ్రేణుల్లో చర్చకు కారణమవుతోంది.