జగన్ కూతురు చదివే చోటా అదే తీరు - ఏపీ సీఎం వల్లే కేంద్రం కొత్త విద్యా విధానం - ఎంపీ రఘురామ సంచలనం
''నాకు తెలిసి మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ లో చదువుకున్నట్లున్నారు. ఇప్పుడాయన కూతురు కూడా అక్కడే చదువుతోంది. లండన్ కు 200 కిలోమీటర్ల దూరంలో వేల్స్ అనే ప్రాంతముంది. గ్రేట్ బ్రిటన్ అధికారిక భాష ఇంగ్లీషే అయినప్పటికీ, వేల్స్ ప్రాంతంలో మాతృభాష అయిన 'వేల్ష్' అభివృద్ధి కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 20 శాతంగా ఉన్న మాతృభాష బోధనను 50 శాతానికి పెంచే ప్రణాళికలు చేశారు. అంత చిన్న కమ్యూనిటీకే సొంత భాషపై అంతగా ప్రేముంటే, గొప్పగా చెప్పుకునే తెలుగు కోసం ఇంకెన్ని ప్రయత్నాలు జరగాలి? అయినా, యునెస్కో దగ్గర్నుంచి దేశాదేశాలన్నీ మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తుంటే, జగన్ మాత్రం 151 సీట్లు వచ్చాయి కదాని ఇష్టమొచ్చినట్లు వెళతానంటే కుదురుతుందా?'' అని వ్యాఖ్యానించారు నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు.

జగన్ వల్లే ఎన్ఈపీ..
కొద్ది గంటల కిందటే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నూతన విద్యా విధానం(ఎన్ఈపీ-2020)ను తాను పూర్తిగా సమర్థిస్తున్నట్లు వైసీపీ రెబల్ ఎంపీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో మాతృభాషను కాలరాసేలా, సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాల వల్లే ఢిల్లీ సర్కారు మేల్కొందని, జగన్ బాటలో మిగతా ముఖ్యమంత్రులు వెళ్లరాదన్న ఆలోచనతోనే కేంద్రం కొత్త విద్యా విధానాన్ని ప్రకటించిందని పేర్కొన్నారు. ఏది ఏమైనా తెలుగుకు ఈ రకంగానైనా మేలు చేసినందుకు సీఎంను అభినందించకుండా ఉండలేనంటూ సెటైర్లు వేశారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఎంపీ రఘురామ.. విద్యా విధానం, పార్టీతో తన విభేదాలపై పలు సంచలన కామెంట్లు చేశారు.

ఇంగ్లీష్తోనే అన్నీ అనడం అవాస్తవం..
ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష మాండలిన్(చైనాలో మాట్లాడేది) అని, రెండో స్థానంలో స్పానిషన్(25కుపైగా దేశాల్లో మాతృభాష) ఉందని, ఆ తర్వాతి స్థానంలో ఇంగ్లీష్, హిందీ వస్తాయని, మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజెస్ లో బెంగాలీ కూడా ఉందని, కేవలం ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనతోనే అన్నీ లభిస్తాయని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని వైసీపీ ఎంపీ రఘురామ అన్నారు. ఎల్లాప్రగడ సుబ్బారావు, సీవీ రామన్ సహా గొప్ప గొప్ప వాళ్లంతా మాతృభాషలోనే చదువుకున్నారని, ఏపీ కంటే అభివృద్ధిలో ఎంతో మందున్న జపాన్, చైనా, కొరియాలోనూ మాతృభాషలోనే బోధన సాగుతుందని, ఇవన్నీ తెలిసి కూడా జగన్ తప్పుడు విధానాలను అనుసరించడం, ఏకంగా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుండం శోచనీయమని రెబల్ వ్యాఖ్యానించారు.

ఎదురు ప్రశ్నలొద్దు.. కేంద్రం మాట విందాం..
‘‘ఇంగ్లీష్ మీడియం గురించి ఎవరైనా ప్రశ్నిస్తే, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటూ సీఎం జగన్ నుంచి వైసీపీ దురభిమానులు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. డబ్బున్నవాళ్లు ట్యూషన్లతో ఇంగ్లీషులో రాణిస్తారు. పేద, మధ్యతరగతి వాళ్లు అంత ఖర్చులు భరించలేరు. ఇదంతా స్టడీ చేసిన తర్వతే ప్రపంచ దేశాలు, మేధావులు అందరూ కలిసి మాతృభాషకు పట్టం కట్టాలని సూచించారు. ఐదో తరగతి వరకూ మాతృభాషలోనే బోధన ఉండాలని కేంద్రం రూపొందించిన నూతన విద్యా విధానం స్పష్టం చేసింది. సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభిస్తామంటున్నారు. ఈ ఏడాది ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమేంటేషన్ వద్దు. వచ్చే ఏడాది నుంచి ఏపీతోసహా అన్ని రాష్ట్రాలూ కేంద్రం విధానాన్నే ఫాలో కావాలి'' అని రఘురామ సూచించారు.

నాకిచ్చిన నోటీసులోనూ భాషే ప్రధానం..
వైసీపీ నుంచి బహిష్కరించే దిశగా తనకు జారీ చేసిన నోటీసులు, విజయసాయి నేతృత్వంలోని బృందం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇచ్చిన ఫిర్యాదులోనూ భాషకు సంబంధించిన అంశమే ప్రధానంగా ఉందని ఎంపీ రఘురామ గుర్తుచేశారు. ఏపీ సర్కారు తలపెట్టిన ఇంగ్లీషు మీడియంపై వ్యతిరేకంగా మాట్లాడినందుకే నోటీసులు ఇచ్చారని, మాతృభాషను విస్మరించడం రాజ్యాంగ విరుద్ధమన్న తన వాదన ఎంత సరైందో.. నూతన విద్యావిధానం ఆమోదంతోనే అర్థమవుతున్నదని, ఆ లెక్కన పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసులు కూడా రాజ్యాంగ విరుద్ధమైనవిగానే భావించాలని రెబల్ ఎంపీ సూత్రీకరించారు.
Recommended Video

సీఎం కలవరు.. సుబ్బారెడ్డి పిలవరు..
ముఖ్యమంత్రి జగన్ ను కలవడానికి తాను సిద్ధంగా ఉన్నా, అందుకాయన సమయం ఇవ్వడం లేదని, అందుకే పదే పదే మీడియాతో మాట్లాడాల్సి వస్తున్నదని రఘురామ చెప్పారు. ఇప్పటిదాకా జరిగినదంతా మర్చిపోయి, రాబోయే నాలుగేళ్లూ పార్టీతో, సీఎం జగన్ తో కలిసి నడవటానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పార్టీలో సమస్యల పరిష్కారం కోసం వెబినార్ ద్వారా నేతలతో మాట్లాడాలన్న తన సూచన ఇంప్లిమెంట్ అవుతున్నదని, జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి తనకు కేటాయించిన జిల్లాల నేతలతో వెబినార్లో సమావేశాలు నిర్వహిస్తున్నారని, పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి అందరితో మాట్లాడినా, తనను మాత్రం పిలవలేదని రఘురామ వాపోయారు. పార్టీ తనకు మాట్లాడే అవకాశం కల్పిస్తే మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఉండబోదన్నారు.












Click it and Unblock the Notifications