ఇంటర్యూ: 14 వర్సిటీల్లో అడ్మిషన్ సాధించిన పూజా
బెంగుళూరు: గత కొన్ని రోజులుగా దేశంలో వార్తల్లో వినిపిస్తోన్న పేరు పూజా చంద్రశేఖర్. బెంగళూరుకు చెందిన ఆమె తల్లిదండ్రులు సాప్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తూ అమెరికాలో స్థిరపడ్డారు. ఇంతకీ పూజా చంద్రశేఖర్ సాధించిన ఘనత ఏమిటంటారా..? అమెరికాలోని 14 యూనివర్సిటీల్లో ఆమె ప్రవేశానికి అనుమతి రాగా వాటిల్లో అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన ఎనిమిది యూనివర్సిటీలు ఉండటం విశేషం.
వర్జీనియాకు చెందిన పూజా చంద్రశేఖర్ ఇంటర్ పూర్తి చేసి తదుపరి విద్యాభ్యాసం కోసం ఏదైనా టాప్ వర్సిటీలో చదవాలనుకుంది. అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎస్ఎటి (స్టాండర్డ్ ఎలిజిబిలటీ టెస్ట్)లో పూజా చంద్రశేఖర్ (17) 4.57 గ్రేడ్ను సాధించి (2,400 మార్కులకు 2,390 మార్కులు) సాధించింది.
అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన ఎనిమిది ప్రఖ్యాత వర్సిటీలతో పాటు 14 వర్సిటీల్లో ప్రవేశం కోసం ఆమె ఒకేసారి దరఖాస్తు చేసింది. దరఖాస్తు అనంతరం ఎస్ఎటిలో అద్భుత నైపుణ్యం ప్రదర్శించడంతో ఆమెకు హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, యాలే, ప్రిన్స్టన్, కార్నెల్, కొలంబియా, బ్రౌన్ వంటి ప్రముఖ వర్సిటీల్లో చేరేందుకు అవకాశం లభించింది. వీటితో పాటు మరో ఆరు ప్రతిష్టాత్మకమైన అమెరికా యూనివర్సిటీల్లో కూడా అడ్మిషన్ లభించింది.
థామస్ జెఫర్సన్ విద్యాసంస్థ నుంచి సైన్స్, టెక్నాలజీలో డిగ్రీ చేసిన పూజ పుట్టి పెరిగిందంతా వర్జీనియాలోనే. అమెరికాలో మిడిల్ స్కూల్ బాలికల కోసం ఆమె ఓ సేవా సంస్థను కూడా ప్రారంభించింది. పార్కిన్సన్ జబ్బు లక్షణాలను ముందస్తుగానే తెలుసుకోగలిగే ఓ మొబైల్ యాప్ను కూడా రూపొందించి అందరి ప్రశంసలు అందుకుంది.
దీంతో వన్ఇండియా పాఠకుల కోసం ప్రత్యేకంగా పూజా చంద్రశేఖర్ ఇంటర్యూని అందిస్తున్నాం. ఈ ఇంటర్యూలో పూజా చంద్రశేఖర్ సాధించిన విజయాలు, ప్రేరణలతో పాటు ఏ యూనివర్సిటీని ఎంచుకున్న విషయాలను తెలియజేసింది.
మీ విజయాలకు ఎవరు ప్రేరణగా నిలిచారు?
మార్పు కోసం ఏది చేస్తే బాగుంటుందనే భాగంగానే నా ప్రాజెక్టులు మొదలయ్యాయి. టెక్నాలజీ పరంగా ఉన్న జండర్ అంతరాన్ని తొలగించడమే తన లక్ష్యమే ప్రేరణగా నిలిచింది.
ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలని అనుకుంటున్నారు?
ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. మే 1 తర్వాత తుది నిర్ణయం తీసుకుంటానన్నారు. హార్వార్డ్, స్టాన్ఫోర్డ్, బ్రౌన్ వంటి యూనివర్సిటీలపై పూజ ఒకింత శ్రద్ధ చూపిస్తోందన్నారు. గతంలో ఈ యూనివర్సిటీల్లో పూజ కొన్ని ప్రోగ్రాములను చేసింది. అందువల్ల ఆ యూనివర్సిటీ మెడికల్ స్కూల్లో అడ్మిషన్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయని తెలిపారు.
చదువు కోసం ఎంత సమయాన్ని కేటాయిస్తారు? చదువుతో పాటు మీ ఆసక్తి ఏంటీ?
రోజుని బట్టి నా వర్కు ఉంటుందన్నారు. సాధారణంగా సాయంత్రం పూటా మూడు నుంచి నాలుగు గంటల పాటు హోం వర్క్ని పూర్తి చేస్తానని చెప్పారు. నాకున్న అతిపెద్ద సాంస్కృతిక ప్రాజెక్టు మాత్రం ‘సిఎస్ గర్ల్స్' అని చెప్పారు.
ప్రాజెక్టు ‘సిఎస్ గర్ల్స్' గురించి వివరిస్తారా?
నేను హైస్కూలు చదివేటప్పుడు టెక్నాలజీ క్లాసుల్లో ఆడపిల్లలు తక్కువగా ఉండడం తనను ఎంతో నిరాశపరిచేదన్నారు. టెక్నాలజీపరంగా ఉన్న జండర్ అంతరాన్ని తొలగించడమే లక్ష్యంలో భాగంగా ప్రాజెక్టు ‘సిఎస్ గర్ల్స్' నెలకొల్పాను. దీంతో పాటు టెక్నాలజీ రంగం వైపు ఆడపిల్లలను ఆకర్షించాలనే లక్ష్యంతోనే ‘స్టెమ్' కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. వర్జీనియాలో ఎంతో పేరొందిన ‘థామస్ జఫర్సన్ స్కూల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ' కోర్సుని పూజా చదివింది. దాని ద్వారా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ వంటి కార్యక్రమాల్లో (ఎస్టిఈం ‘స్టెమ్') మిడిల్ స్కూల్ అమెరికన్ అమ్మాయిలు పాల్గొనేలా ప్రోత్సహిస్తోంది.
సామాజిక విషయాల్లో టెక్నాలజీని బాలికలు ఉపయోగించాలని చెప్పారు కదా? అది సాధ్యమేనా?
ప్రాజెక్టు ‘సిఎస్ గర్ల్స్' ని జాతీయ కంప్యూటర్ సైన్స్ కాంపిటేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దేశంలోని మధ్య తరగతి పాఠశాల్లోని అమెరికన్ బాలికలు టెక్నాలజీని వినియోగించే దిశగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 500 మంది బాలికలకు, రీజినల్ కంప్యూటర్ సైన్స్ వర్క్షాప్లకు ద్వారా 200 మంది బాలికలను చేరువైందన్నారు. ఈ ప్రాజెక్టుకు మరింతగా ప్రచారం కల్పించేందుకు గాను వైట్ హౌస్ వర్గాలతో పాటు సిలికాన్ వ్యాలీలోని ఎగ్జిక్యూటివ్లను ఆహ్వానించాను.
మీరు రూపొందించిన మొబైల్ యాప్ గురించి తెలియజేస్తారా?
పార్కిన్సన్ జబ్బు లక్షణాలను ముందస్తుగానే తెలుసుకోగలిగే మొబైల్ యాప్ను రూపొందించాను. 10 నుంచి 15 సెకన్ల పాటు ఈ యాప్లో మాట్లాడితే పార్కిన్సన్ జబ్బు లక్షణాలను ముందుగానే తెలియజేస్తుంది. 250 మంది పార్కిన్సన్ జబ్బు లక్షణాలను కలిగి ఉన్న వారికి పరీక్ష నిర్వహించామని, 96 శాతం గుర్తించటంలో ఖచ్చితంగా పనిచేసిందని చెప్పారు. ఈ ఏడాది మేలో జరగనున్న ఓ కాన్పరెన్స్లో ఈ యాప్పై సుదీర్ఘ ఉపన్యాసం ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఈ యాప్ను ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి?
ప్రస్తుతానికి ఈ యాప్ అధికారికంగా అందుబాటులో లేదు. వచ్చే ఏడాదికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.