గురజాలలో 144 సెక్షన్ విధింపు: ఛలో పల్నాడును అడ్డుకోవడానికేనంటోన్న టీడీపీ
గుంటూరు: మరో 24 గంటల్లో తెలుగుదేశం పార్టీ ఛలో పల్నాడు, ఛలో ఆత్మకూరు ఆందోళలను నిర్వహించనున్న నేపథ్యంలో.. గుంటూరు జిల్లాలోని గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో 144 సెక్షన్ విధించడం విమర్శలకు దారి తీస్తోంది. తెలుగుదేశం పార్టీ నిర్వహించ తలపెట్టిన ఛలో ఆత్మకూరు ఆందోళను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే 144 సెక్షన్ ను విధించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం తమను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. ఈ ఆందోళనను నిర్వహించి తీరుతామంటూ టీడీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఛలో పల్నాడు, ఛలో ఆత్మకూరు ఆందోళనలను అనుమతి లేదని హోం శాఖ మంత్రి సుచరిత స్పష్టం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే 144 సెక్షన్ ను విధించడం చర్చనీయాంశమైంది.
ఆదర్శ దంపతులు..వారే నాకు ఆదర్శం: నారా లోకేష్!
వినాయక విగ్రహాల నిమజ్జనం, మొహర్రం పండుగలు ఒకేసారి నిర్వహిస్తున్న సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండటానికే 144 సెక్షన్ ను విధించినట్లు పోలీసులు చెబుతున్నారు. గురజాల రెవెన్యూ డివిజన్ పరిధి మొత్తానికీ దీన్ని వర్తింపజేశారు. ఈ మేరకు గురజాల సబ్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, రెవెన్యూ డివిజనల్ అధికారి జే పార్థసారథి ఉత్తర్వులు జారీచేశారు. 12వ తేదీ రాత్రి 10 గంటల వరకూ ఈ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. బుధవారం తెలుగుదేశం పార్టీ ఛలో ఆత్మకూరు ఆందోళనకు పిలుపు ఇచ్చింది. దీన్ని భగ్నం చేయడానికే ప్రభుత్వం 144 సెక్షన్ ను విధించిందంటూ మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు.
పల్నాడు ప్రాంతంలో తమ పార్టీ కార్యకర్తలపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారని, తమ నిరసనను తెలియజేయడానికే ఛలో ఆత్మకూరు ఆందోళనను నిర్వహించ తలపెట్టినట్లు చెప్పారు. నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీ కార్యకర్తలపై అధికార వైఎస్సార్సీపీ కార్యకర్తలు, మద్దతుదారులు తమ పార్టీ కార్యకర్తలపై ప్రాణాంతక దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాము ప్రజాక్షేత్రంలోకి దిగబోతున్నామని ఆయన వెల్లడించారు. అధికారాన్ని కోల్పోయినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ ప్రజాదరణను కోల్పోలేదనే విషయాన్ని తాము ఈ ప్రదర్శన ద్వారా ప్రభుత్వానికి చాటి చెప్పబోతున్నట్లు వెల్లడించారు.
దాడులకు పాల్పడటంతో పాటు క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్న తమ పార్టీ నాయకులపై పోలీసులు అక్రమంగా కేసులను నమోదు చేస్తున్నారని, అలాంటి వారికి పార్టీ అండగా ఉంటుందని అన్నారు. అక్రమ కేసులను ధీటుగా ఎదుర్కోవడానికి పార్టీ లీగల్ సెల్ ను బలోపేతం చేయబోతున్నట్లు చెప్పారు. తమ పార్టీ నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసుల విషయాన్ని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఆయా విషయాలను చర్చించడానికి ఈ నెల 10వ తేదీన పార్టీ లీగల్ సెల్ సమావేశమౌతుందని అన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆటలను సాగనివ్వబోమని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, మనోబలాన్ని కూడగట్టుకోవాలని అన్నారు.