విషాదం: దొంగతనం ఆరోపణలతో మనస్తాపం, కుటుంబం ఆత్మహత్య
గుంటూరు: జిల్లాలో బాపట్ల మండలం మరుప్రోలువారిపాలెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. దొంగతనం చేశారనే ఆరోపణలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ కుటుంబం ఆత్మహత్యకు చేసుకుంది. తమ కూతురుతోపాటు భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు.
మే 10న పోలీస్ స్టేషన్లో బాసివిరెడ్డిపాలెంలో మోటార్లు అపహరణకు గురయ్యాయి. దీంతో 16న మోటార్ల యజమానులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, విచారణలో మరుప్రోలువారిపాలెంకు చెందిన వీరస్వామి రెడ్డి దొంగతనం చేసినట్లు తేలిందట.

ఈ క్రమంలో మే 21న వీరస్వామిరెడ్డిని పిలిపించి ప్రశ్నించినట్లు తెలిసింది. 22న నాలుగు మోటార్లు రికవరీ చేసినట్లు సమాచారం. 23 వీరస్వామి రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన వీరస్వామి కుటుంబంతోపాటు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సోమవారం ఉదయం వీరస్వామి కుటుంబం ఇంటి తలుపులు తీయకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా.. భార్యాభర్తలు కూతురు నేలపై పడిపోయి ఉన్నారు.
కొనఊపిరితో ఉన్న వీరస్వామిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. అతడి భార్య, కుమార్తె అప్పటికే మరణించారు. చోరీ చేశారనే ఆరోపణలు రావడంతోనే ముగ్గురూ ఆహారంలో విషం కలుపుకుని ప్రాణాలు తీసుకున్నారని తెలుస్తోంది.
కాగా, వీరస్వామిరెడ్డిపై అక్రమంగా చోరీ కేసులు బనాయించారని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులతో చెప్పి కొట్టిస్తామని బెదిరించడంతో వారంతా ఆత్మహత్య చేసుకున్నారని వీరాస్వామి బావమరిది అంకిరెడ్డి ఆరోపించారు. పోలీసులు మాత్రం మోటార్లు చోరీ చేసి దొరికిపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నారని చెబుతుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications