అమరావతి రైతుల మహా పాదయాత్ర.. భారీగా తరలివచ్చిన జనం..
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అక్కడి రైతులు మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. సోమవారంతో రాజధానిపై ఆందోళనలు 20 రోజులకు చేరుకున్న నేపథ్యంలో తుళ్లూరు నుంచి 10వేల మందితో మందడం వరకు మహాపాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. జాతీయ జెండాలు చేతబట్టి మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు అని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.
ఏపీ రాజధాని రగడ .. గ్రేటర్ రాయలసీమ ఇవ్వండి లేదా కర్నూలును తెలంగాణలో కలపండి .. కొత్త డిమాండ్
ఇదివరకు వచ్చిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక,జీఎన్ రావు కమిటీ నివేదిక రెండూ ప్రభుత్వ జిరాక్స్ కాపీలేనని ఈ సందర్భంగా రైతులు విమర్శించారు. రేపు రాబోయే హైపవర్ కమిటీ నివేదిక కూడా కొత్తగా చెప్పేదేమీ ఉండదని.. అది వీటికి కలర్ జిరాక్స్ లాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణం కోసం 33వేల ఎకరాలను స్వచ్చందంగా ఇచ్చిన రైతుల త్యాగాలను అవహేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు రైతులు మహాపాదయాత్రకు పూనుకోగా.. మరోవైపు పోలీసులు మాత్రం అందుకు అనుమతి లేదంటున్నారు. రైతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాదయాత్రను పూర్తి చేస్తామని,ఎవరు అడ్డు వచ్చినా ఆగేది లేదని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మహాపాదయాత్ర సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు.
ఇదిలా ఉంటే,రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో జరుగుతున్న రైతుల ఆందోళనలపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. వాళ్లంతా పెయిడ్ ఆర్టిస్లులు అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అవన్నీ టీడీపీ డైరెక్షన్లో జరుగుతోన్న ఆందోళనలే అని కొట్టిపారేస్తున్నారు. వైసీపీ విమర్శలపై టీడీపీ గట్టిగానే ప్రశ్నిస్తోంది. జగన్ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా అంగీకరించి ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే రూ.10వేల కోట్లు అమరావతిపై ఖర్చు చేశామని, రైతులకు అన్యాయం చేయవద్దని ఆయన డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆందోళనలు,ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నా.. ప్రభుత్వం నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్,జీఎన్ రావు కమిటీలు రాష్ట్రంలో అభివృద్ది వికేంద్రీకరణ అవసరమని ఇప్పటికే నివేదిక ఇచ్చేశాయి. హైపవర్ కమిటీ కూడా దాదాపుగా ఇదే విషయాన్ని చెప్పవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ విశాఖలో రాజధాని ఏర్పాటైతే అమరావతి రైతులకు ఎలా న్యాయం చేస్తారన్నదే ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. భూములు తిరిగి ఇచ్చేస్తామని వైసీపీ నేతలు చెబుతున్నా.. ఎవరి భూమి ఎక్కడుందో ఇప్పుడు గుర్తించడం కష్టమైన పని అన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అమరావతి రైతులకు ఎలా నచ్చజెబుతుంది లేదా వాళ్ల అభిప్రాయాలతో పని లేకుండానే నిర్ణయం తీసుకుంటుందా అన్నది వేచి చూడాలి.