చంద్రబాబు కంటే ముందే సీఐడీ విచారణకు వైసీపీ ఎమ్మెల్యే: అమరావతి భూ కుంభకోణం..బట్టబయలు
అమరావతి: అమరావతి భూముల కుంభకోణం వ్యవహారంలో అనూహ్య పరిస్థితుల మధ్య ఏపీ సీఐడీ నుంచి నోటీసులను అందుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఈ నెల 23వ తేదీన విచారణను ఎదుర్కోవాల్సి ఉంది. ఆయనతో పాటు మాజీమంత్రి పీ నారాయణ సైతం సీఐడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో వారిద్దరి కంటే ముందే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంగళగిరి శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఐడీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా ఆయన కొద్దిసేపటి కిందటే ఏపీ సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు.
కోర్టులో తేల్చుకుందాం: సీఐడీ నోటీసులపై న్యాయపోరాటం: ఏలూరుకు చంద్రబాబు
అమరావతిలో దళితులకు కేటాయించిన 500 ఎకరాల అసైన్డ్ భూముల అంశంలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకే చంద్రబాబు, నారాయణపై సీఐడీ కేసు నమోదు చేసింది. 41 (ఎ) సీఆర్పీసీ కింద వారిద్దరికీ నోటీసులను జారీ చేసింది. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారికి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను అందజేయాల్సిందిగా సీఐడీ అధికారులు ఆళ్ల రామకృష్ణా రెడ్డిని ఆదేశించారు. దీనికోసం సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసు మేరకు ఆయన విజయవాడ సత్యనారాయణపురంలో సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి చేరుకున్నారు.
కొన్ని డాక్యుమెంట్ల, ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవోలు, రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) ఇచ్చిన ఆదేశాలకు చెందిన కాపీలను ఆయన తన వెంట తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. వాటన్నింటినీ సీఐడీ అధికారులకు అందజేయడంతో పాటు.. అమరావతి భూ కుంభకోణం ఎలా చోటు చేసుకుంది?.. దానిపై తాను సేకరించిన వివరాలను ఆయన సీఐడీ చీఫ్ సునీల్ కుమార్, దర్యాప్తు అధికారి ఏ లక్ష్మీనారాయణ రావులకు అందజేస్తారు. ఈ కుంభకోణంలో తమకు కొన్ని అనుమానాల గురించి ఆళ్ల రామకృష్ణా రెడ్డిని అడిగి తెలుసుకుంటారని తెలుస్తోంది.