నాలుగెకరాలు కొనుక్కోలేరా?,లాక్కోవడం దారుణం : బాబుపై అంబటి ఫైర్
గుంటూరు : రాజకీయ పార్టీలకు ప్రభుత్వ భూములను కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ప్రతిపక్ష వైసీపీ నేతలు. తాజాగా దీనిపై స్పందించిన వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు.. సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ జీవో వెనుక అసలు ఉద్దేశం.. పార్టీల పేరు చెప్పి ఖరీదైన భూములను కాజేయడమేనని ఆరోపించారు అంబటి. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన, పార్టీలకు స్థలాల కేటాయింపును సాకుగా చూపుతూ నల్లపాడులో రైతుల వద్ద భూములు లాక్కోవడం దారుణమన్నారు.

రైతుల భూములను చంద్రబాబు యథేచ్చగా స్వాహా చేస్తున్నారని, రైతుల భూములను రాజకీయ పార్టీలకు ఎలా కేటాయిస్తారని నిలదీశారు అంబటి. ప్రభుత్వ తాజా జీవో ప్రకారం అసెంబ్లీలో 50 శాతం కన్నా ఎక్కువ సీట్లు ఉన్న పార్టీలకు నాలుగు ఎకరాలు, 25 నుంచి 50 శాతం ఉంటే అర ఎకరం, కనీసం ఒక్క సభ్యుడైనా ఉంటే వెయ్యి గజాల చొప్పున సీఆర్డీఏ పరిధిలో స్థలాలు కేటాయింపుకు అనుమతినిస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం.
ఇదే విషయాన్ని ప్రస్తావించిన అంబటి రాంబాబు.. చంద్రబాబు నాలుగెకరాలు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారా అంటూ ప్రశ్నించారు. రాజధానిలో నాలుగెకరాలు, జిల్లా కేంద్రాల్లో రెండేసి ఎకరాల చొప్పున కాజేయడానికే చంద్రబాబు ఈ వ్యవహారానికే తెరలేపారన్నారు.
కృష్ణా పుష్కరాల్లో ప్రభుత్వ అవినీతి : పెద్దిరెడ్డి
కృష్ణా పుష్కరాల కోసం భారీగా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. తమ పార్టీ నేతలకు, అనుచరులకే కాంట్రాక్టులు కట్టబెట్టిందని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కృష్ణా పుష్కరాల పనుల్లో అవినీతి రాజ్యమేలుతుందన్న ఆయన, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కృష్ణా పుష్కర పనుల్లో నాణ్యత పూర్తిగా లోపించిందని నాసిరకం నిర్మాణాలు చేపడుతున్నారన్నారు పెద్దిరెడ్డి.












Click it and Unblock the Notifications