కొత్త తరహా రాజకీయాలకు కేరాఫ్.. వైఎస్ జగన్!
అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో.. ఆ మాట కొస్తే దేశంలోనే అతి చిన్న వయస్సు ఉన్న ముఖ్యమంత్రి. దేశ రాజకీయాల్లోనే అత్యంత సీనియర్గా ముద్రపడిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మొన్నటి ఎన్నికల్లో మట్టి కరిపించి విజేతగా ఆవిర్భవించిన యువనేత. సంప్రదాయ రాజకీయాలకు ఆధునికతను, కాస్త మానవత్వాన్ని జోడించిన యంగ్ పొలిటీషియన్గా కనిపిస్తున్నారాయన. శాసన సభ సమావేశాల సందర్భంగా తొలి రోజు ఆయన చేసిన ప్రసంగం సమకాలీన రాజకీయ వేత్తలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి, అందలం ఎక్కడానికి ఎలాంటి అడ్డదారులైనా తొక్కడానికి సిద్ధంగా ఉన్న ప్రస్తుత రాజకీయాల్లో స్వచ్ఛమైన, సంప్రదాయబద్ధమైన రాజకీయాలకు తెర తీశారని చెబుతున్నారు విశ్లేషకులు.

ప్రతిపక్ష నేతగా ఢక్కామొక్కీలు..!
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ అనేక ఢక్కా మొక్కీలు తిన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పటికీ.. ఆయనను ఏ మాత్రం పట్టించుకోలేదు అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ. వైఎస్ జగన్పై వ్యక్తిత్వం దాడికి దిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. `నువ్వు మగాడివైతే, రాయలసీమ రక్తం నీలో ఉంటే..` అనే అభ్యంతరకరమైన, అసభ్యకరమైన పదజాలాన్ని ప్రయోగించారు అప్పటి తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు. కేవలం అయిదు లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయి.. 67 మంది సభ్యులతో బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏనాడూ ఆ దృష్టితో చూడలేదు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ, అధికార పార్టీ తెలుగుదేశం గానీ.

ఫిరాయింపులకు ప్రోత్సాహం.. మంత్రిపదవులు!
భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాల్లో ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం అని అర్థం. అలాంటి ప్రతిపక్షం అనే పేరును వినడానికే సిద్ధపడలేదు చంద్రబాబు. ప్రతిపక్ష పార్టీగా గుర్తించడానికీ సిద్ధపడలేదు. వైఎస్ జగన్ గానీ, ఇతర సభ్యులు గానీ ఇచ్చే సూచనలు, సలహాలను ఆలకించ లేదు. ప్రతిపక్ష నేత సహా మరెవ్వరికీ మాట్లాడే అవకాశాన్ని ఇవ్వలేదు. ఎదురు దాడికి దిగడం, మైక్ ఇవ్వకుండా మాట్లాడనివ్వకుండా చేయడం, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం.. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న అభివృద్ధి, సంక్షేమ పనుల కంటే.. ఇలాంటి అనైతిక చర్యలు ప్రధానంగా కనిపించాయి.
Recommended Video


నిర్వీర్యం చేసే ప్రయత్నం..
ప్రతిపక్షానికి చెందిన 67 మంది సభ్యుల్లో ఏకంగా 23 మందిని తమ వైపు లాక్కోగలిగారు. ఉన్న ఎనిమిది మందిలో ముగ్గురు లోక్సభ సభ్యులనూ తన వైపునకు తిప్పుకోగలిగారు. నయానో, భయానో, బెదిరించో, ఆశ చూపించో.. ఏదో ఓ రకంగా ప్రతిపక్షాన్ని లేకుండా చేయడానికి, సంఖ్యాబలాన్ని తగ్గించడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. 2019 ఎన్నికలకు రెండేళ్ల ముందు వరకూ ప్రతిపక్ష సభ్యులను తమ పార్టీలోకి చేర్చుకునే పనులను కొనసాగించారాయన.

ఓడలు బండ్లు..బండ్లు ఓడలు!
కాలం ఎల్లవేళలా ఒకేలా ఉండదనే సూత్రాన్ని వైఎస్ జగన్ బలంగా విశ్వసిస్తూ వచ్చారు. రాజకీయ నాయకుడిగా, ప్రతిపక్ష నేతగా తనకు అత్యంత ప్రతికూలంగా ఉన్న పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచారు. జననేతగా ఎదిగారు. నైతిక రాజకీయాలు చేస్తూ, ప్రజాస్వామ్య బద్ధంగా తన రాజకీయ జీవితానికి బాటలు వేసుకున్నారు. తన వ్యవహార శైలితో సామాన్య ప్రజలకు చేరువ అయ్యారు. దీని ప్రభావం మొన్నటి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. 102 మంది శాసన సభ్యులతో బలంగా కనిపించిన తెలుగుదేశం పార్టీ, 40 సంవత్సరాల రాజకీయ వ్యూహం, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన పరిపాలనా అనుభవం ఉన్న చంద్రబాబు నేతృత్వంలో కేవలం 23 సభ్యులకు మాత్రమే పరిమితమైంది. ఈ సంఖ్య.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రతిపక్షం నుంచి తీసుకున్న సభ్యులకు సమానం.

అదే గేమ్..వైఎస్ జగన్ ఆరంభిస్తే..!
ప్రతిపక్షాన్ని బలహీన పర్చేలా 23 మంది తన హయాంలో సభ్యులను కొనుగోలు చేసిన చంద్రబాబు తరహాలోనే వైఎస్ జగన్ కూడా అనైతిక, అప్రజాస్వామిక రాజకీయాలకు తెర తీశారే అనుకుందాం. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమౌతుంది? అసలే సభలో ఉన్నది 23 మంది. ఒక్కసారి వైఎస్ జగన్ గేట్లు తెరిస్తే.. కనీసం డజను మంది తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడం ఖాయం. ఈ విషయాన్ని స్వయంగా ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. కనీసం అయిదు మంది సభ్యులను తాను లాక్కోగలిగినా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదా కూడా దక్కదని వైఎస్ జగన్ సైతం స్పష్టం చేశారు.
తాను అలాంటి పనులు చేయబోనని, అనైతిక రాజకీయాలకు పాల్పడబోనని ఆయన చంద్రబాబుకు హామీ ఇచ్చారు. భరోసా కల్పించారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైనా తమ పార్టీలోకి రావాలనుకుంటే.. తమ శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని కండీషన్ పెట్టారు. రాజీనామా చేయకుండా వస్తే.. వారిని అనర్హులుగా ప్రకటించాలని స్వయంగా వైఎస్ జగనే స్పీకర్ను కోరారు. వైఎస్ జగన్ చేసిన ఈ ప్రకటన దేశం మొత్తాన్నీ ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. ప్రత్యేకించి- యువత.. వైఎస్ జగన్లో తమను తాము చూసుకుంటోంది. కొత్త తరహా రాజకీయాలకు వైఎస్ జగన్ కేరాఫ్ అడ్రస్గా మారారని ప్రశంసిస్తోంది.












Click it and Unblock the Notifications