గుంటూరు జిల్లాకు రోశయ్య పేరు..? పెట్టాల్సిందేనని డిమాండ్.. మరీ సీఎం జగన్
ప్రముఖ వ్యక్తులు చనిపోతే వారి పేర్లను రోడ్లకు, జిల్లాలకు పెట్టడం సహజమే. వారు చేసిన సేవలను బట్టి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. దివంగత నేత వైఎస్ఆర్ చనిపోయాక కడప జిల్లాకు ఆయన పేరును పెట్టిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు.. ఒంగోలుకు ప్రకాశం పేరుతో పేర్లు పెట్టారు. ఇటీవల మాజీ సీఎం రోశయ్య చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన జన్మించిన జిల్లా గుంటూరుకు పేరు పెట్టాలనే డిమాండ్ వచ్చింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రిగా సేవలందించిన రోశయ్యకు గుంటూరు జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది. జిల్లాలోని వేమూరులోనే ఆయన పుట్టి పెరిగారు. రోశయ్య కన్నుమూసిన తర్వాత గుంటూరు జిల్లాల్లో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీపడ్డాయి. ఇప్పుడు మరొక కొత్త ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ఆయన పుట్టి పెరిగిన గుంటూరు జిల్లాకు కొనిజేటి రోశయ్య పేరుపెట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ మేరకు మంగళవారం జగ్గయ్యపేటలో జరిగిన రోశయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వినతిపత్రం అందజేశారు.

ప్రస్తుతం గుంటూరు జిల్లా రాజకీయాలన్నీ రోశయ్య విగ్రహం చుట్టే తిరుగుతున్నాయి. ఆయన కన్నుమూసినప్పటి నుంచి తామంటే తాము విగ్రహాలు ఏర్పాటు చేస్తామంటూ వైసీపీ, టీడీపీలు పోటాపోటీగా ప్రతిపాదనలు చేశారు. టీడీపీ నాయకుల ఎత్తుగడలను ముందుగానే గమనించిన వైసీపీ జగ్గయ్యపేటలోని బస్టాండ్ సెంటర్లో శరవేగంగా రోశయ్య విగ్రహం ఏర్పాటు చేసింది. బుధవారం ఈ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హాజరయ్యారు. కార్యక్రమంలోనే రోశయ్యకు భారతరత్న ఇవ్వాలని, గుంటూరు జిల్లాకు రోశయ్య జిల్లాగా పేరు పెట్టాలని వైసీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. మంత్రి వెల్లంపల్లికి వినతి పత్రం అందించారు.
ఈ విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళతామని మంత్రి వెల్లంపల్లి, ఉదయభాను వైసీపీ కౌన్సిలర్లకు హామీ ఇచ్చారు. వారి డిమాండ్ నెరవేర్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలోనే డిమాండ్ తీరిస్తే బాగుంటుందని కొందరు అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications