తెనాలిలో ఉద్రిక్తత.. అన్న క్యాంటిన్ కూరగిన్నెలు ఎత్తుకెళ్లిన పోలీసులు!!
గుంటూరు జిల్లా తెనాలిలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గత నెల 12న టీడీపీ నేతలు అన్న క్యాంటీన్ను ఏర్పాటు చేశారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, తీసివేయాలంటూ మున్సిపల్ అధికారులు రెండురోజుల క్రితం నోటీసులిచ్చారు. తొలగించాలంటూ నోటీసులివ్వడం సరికాదంటూ టీడీపీ నేతలు అందోళనకు దిగారు. పోలీసులు ఆ ప్రాంతంలో మొహరించి క్యాంటిన్కు ఆహారం తెచ్చే వాహనాన్ని ఆపేశారు. అందులోని కూర పాత్రలను తీసుకెళ్లిపోయారు. దీంతో టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పార్టీ శ్రేణులు భారీగా అక్కడకు చేరుకున్నాయి.

దుకాణాలు మూయించిన పోలీసులు
అన్న క్యాంటిన్కు పోటీగా వైసీపీ నేతలు కూడా ఐదు రోజుల క్రితం క్యాంటిన్ ఏర్పాటు చేశారు. దాన్ని అధికారులు తొలగించారు. టీడీపీ నేతలు ఇక్కడే భోజనం పంపిణీ చేస్తామని చెప్పడంతో ఆందోళనలు జరుగుతాయనే అనుమానంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మార్కెట్ సెంటర్లోని దుకాణాలను మూయించారు. ఇక్కడకు వచ్చే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అన్న క్యాంటిన్కు సంబంధించిన కూరగిన్నెలను అప్పగించాలంటూ టీడీపీ శ్రేణులు ధర్నాకు దిగాయి.

జగన్ కు మానవత్వం లేదా?
తెనాలిలో అన్న క్యాంటిన్ ను అడ్డుకోవడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. అన్నం తినే వారెవ్వరూ అన్న క్యాంటీన్ను అడ్డుకోరని నిప్పులు చెరిగారు. కుప్పం, నందిగామ, మంగళగిరిలో అన్న క్యాంటీన్లను అడ్డుకోవడంతోపాటు ఇప్పుడు తెనాలిలో అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్రెడ్డికి మానవత్వం లేదా? అని ప్రశ్నంచారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్న క్యాంటీన్ నిర్వహించి తీరుతామని, పేదల ఆకలి తీరుస్తామని లోకేశ్ స్పష్టం చేశారు.

ఇరుపార్టీల మధ్య వివాదం
అన్న క్యాంటిన్ల నిర్వహణకు సంబంధించి టీడీపీ నేతలకు, వైసీపీ నేతలకు వాగ్వాదం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబు పర్యటన సమయంలో అన్న క్యాంటిన్ ధ్వంసం చేయడంపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా క్యాంటిన్ నిర్వహించి తీరుతామని ప్రకటించారు. అంతకుముందు మంగళగిరిలో క్యాంటిన్ నిర్వహణపై ఇరుపార్టీల మధ్య గొడవ జరిగింది. నందిగామతోపాటు తాజాగా తెనాలిలో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోందని, క్యాంటిన్ తొలగించాలంటూ నిర్వాహకులకు అధికారులు నోటీసులిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల మధ్య వివాదం తలెత్తడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications