టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కన్నుమూత
గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 102 సంవత్సరాలు. ఈ తెల్లవారు జామున గుంటూరులోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆవిర్భావం నుంచీ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వస్తోన్న కొద్దిమంది నాయకుల్లో యడ్లపాటి ఒకరు. ఆయన మరణం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.
ప్రముఖ రైతు నాయకుడు ఎన్జీ రంగా అనుచరుడిగా యడ్లపాటికి పేరుంది. స్వతంత్ర పార్టీతో ఆయన రాజకీయ జీవితం ఆరంభమైంది. స్వతంత్ర పార్టీ తరఫున గుంటూరు జిల్లా వేమూరు నుంచి శాసన సభ్యకు ఎన్నికయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1978లో అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, ఘన విజయం సాధించారు. మర్రి చెన్నారెడ్డి హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు.

ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన అనంతరం అందులో చేరారు. 1983లో ఆవిర్భావం నుంచీ టీడీపీలో కొనసాగుతున్నారు. జిల్లాల్లో పార్టీ బలోపేతం కావడానికి కృషి చేసిన వారిలో యడ్లపాటి ఒకరు. గుంటూరు జెడ్పీచైర్మన్గా పని చేశారు. టీడీపీ పొలిట్ బ్యురో సభ్యునిగా సుదీర్ఘకాలం పాటు పని చేశారు. తెలుగు రైతు అధ్యక్షుడిగా పార్టీకి సేవలను అందించారు. యడ్లపాటి చేసిన సేవలను గుర్తుంచుకుని ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది పార్టీ నాయకత్వం.
రాజ్యసభ పదవీకాలం ముగిసిన తరువాత వెంకట్రావ్ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గుంటూరులోని తన కుమార్తె నివాసంలో ఉంటోన్నారు. గత ఏడాది ఆయన కుమారుడు యడ్లపాటి జయరాం మరణించారు. కాగా వెంకట్రావ్ మరణం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తోన్నారు. మాజీమంత్రులు నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాస్ రావు, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications