షాకింగ్ : పట్టపగలు.. నడిరోడ్డుపై... క్షణాల్లో రూ.9లక్షలు మాయం చేసేశాడు...
గుంటూరు పట్టణంలో పట్టపగలే ఓ దొంగ చేతివాటం ప్రదర్శించాడు. స్కూటీ డిక్కీలో ఉంచిన రూ.9లక్షలు కాజేశాడు. సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. టిఫిన్ చేసేందుకు వెళ్లి వచ్చిన ఆ స్కూటీ వ్యక్తి... డిక్కీలో డబ్బులు లేకపోవడంతో షాక్ తిన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వివరాల్లోకి వెళ్తే... గుంటూరులోని కొరిటెపాడుకు చెందిన ఓ వ్యక్తి మిర్చి యార్డులో పనిచేస్తున్నాడు. వ్యాపార లావాదేవీల నిమిత్తం డబ్బు అవసరం ఉండి సోమవారం(ఏప్రిల్ 19) సిటీ యూనియన్ బ్యాంకుకు వెళ్లాడు. రూ.9లక్షలు డ్రా చేసిన అతను.. బ్యాంకు నుంచి బయటకొచ్చాక తన స్కూటీ డిక్కీలో ఆ డబ్బు పెట్టాడు.
అనంతరం సమీపంలోని ఓ హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్లాడు.ఇంతలో ఓ వ్యక్తి ఆ స్కూటీ వద్దకు వచ్చి... తన వద్ద ఉన్న తాళంతో దాని డిక్కీ తెరిచాడు. ఆపై అందులో ఉన్న డబ్బు సంచిని కాజేసి పరారయ్యాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవి కెమెరాల్లో రికార్డయ్యాయి. కాసేపటికి తిరిగిచ్చిన స్కూటీ వ్యక్తి... డిక్కీలో డబ్బు లేకపోవడంతో షాక్ తిన్నాడు. వెంటనే లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇలా స్కూటీ డిక్కీలో దాచిన డబ్బును చోరీ చేసిన ఘటనలు గతంలోనూ చాలానే చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది జనవరిలో తెలంగాణలోని మేడ్చల్లో బైక్ డిక్కీ నుంచి ఓ దొంగ రూ.6లక్షలు కాజేశాడు. తన వద్ద పనిచేసే కూలీల ఖాతాల్లో డబ్బు జమచేసేందుకు లక్ష్మణ్ అనే వ్యక్తి తన అల్లుడు రాజేందర్ను తీసుకుని బ్యాంకుకు వెళ్లాడు. ఈ క్రమంలో డబ్బును స్కూటీ డిక్కీలో పెట్టి రాజేందర్ బ్యాంకు లోపలికి వెళ్లాడు. లక్ష్మణ్ ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకు వెళ్లాడు.
కాసేపటికి రాజేందర్ లక్ష్మణ్కు ఫోన్ చేసి బ్యాంకు లోపలికి డబ్బు తీసుకురమ్మన్నాడు. కానీ లక్ష్మణ్ వెళ్లి చూసేసరికి అందులో డబ్బు కనిపించలేదు.దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోవడంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.