మంగళగిరి సీటు మతలబు..! టికెట్ అంశంలో ఆర్కేకి షాక్ ..!!
అమరావతి/హైదరాబాద్ : దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత వీరాభి మాని, జగన్మోహన్ రెడ్డికి ఎంతో విశ్వాసపాత్రుడు ఐన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఊహించని షాక్ తగిలింది. పార్టీ శ్రేణులు కూడా అవాక్కయ్యేలా ఆ పార్టీ అధినేత జగన్ తీసుకున్ననిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఓ విధంగా చెప్పాలంటే, రెడ్డి వర్గంలోనే ఇది చిచ్చుపెట్టేదిగా ఉందనే వాదన వినిపిస్తుంది. మంగళగిరి అసెంబ్లీ స్థానాన్ని 2014లో కేవలం 8 ఓట్ల మెజార్టీతో కొండ్రు కమలపై ఆర్కె నెగ్గారు. ఓ విధంగా జగన్కు ఇది ఊరటనిచ్చిన గెలుపు కూడా. పైగా, జగన్పై ఈగవాలినా, టీడీపీ తరపు నుంచి ఎటువంటి నిర్ణయం వెలువడినా, కోర్టులంటూ తిరిగిన నేత కూడా ఆర్కేనే. వైసీపిలో సున్నిత మనస్కుడని, అందరిని కలుపుకుని పోయే వ్యక్తి అని పేరుంది.
తిరుపతి సదావర్తి భూముల వ్వవహారంలో హైకోర్టును ఆశ్రయించి.. సర్కారు తీరును నిలదీశారు. ఆ తరువాత రాజదాని భూములు, అగ్రిగోల్డ్ వ్వవహారం వంటి కీలక అంశాలపై పోరాడారు. అటువంటి నేతకు సీటు ఈ సారి గెలవటం ప్రతిస్టాత్మకం అంటూ పార్టీ వర్గాలు లెక్కలు కడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఉడతా శ్రీనుకే మంగళగిరి సీటు కేటాయిస్తున్నారంటూ, అది కూడా పార్టీ అధినేత జగన్ ప్రకటించారంటూ ప్రచారం ఊపందుకుంది. బీసీల ఓట్ల కోసం జగన్ ఇటువంటి అసంబద్ద నిర్ణయం తీసుకోవటం సహేతుకం కాదంటూ. వైసీపీ శ్రేణుల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఇదే సమయంలో ఆర్కే కూడా సెలఫోన్ స్విఛాఫ్ చేసుకుని అజ్ఙాతంలోకి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.