హిందూ మహిళకు ముస్లిం సోదరులు అంత్యక్రియలు: కరోనా సోకడంతో ముందుకురాని బంధువులు
గుంటూరు: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కొందరు ముస్లిం సోదరులు మానవత్వాన్ని చాటుకున్నారు. పొన్నూరు మండలం నండూరు గ్రామంలో శుక్రవారం హిందూ మతానికి చెందిన లక్ష్మీశెట్టి సామ్రాజ్యం(68) అనే వృద్ధురాలు కరోనాతో మరణించారు.
అయితే, ఆమె మృతదేహాన్ని కాటికి తరలించడానికి, దహన సంస్కారాలు నిర్వహించేందుకు బంధువులు, గ్రామస్తులు ముందుకు రాలేదు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పొన్నూరుకు చెందిన ముస్లిం యూనైటెడ్ ఫ్రంట్ సభ్యులు, ఎంఎం యూత్ సభ్యులు మేమున్నమంటూ ముందుకు వచ్చారు.
హిందూ సాంప్రదాయం ప్రకారం ఆ మహిళ భౌతికకాయాన్ని స్మశానికి తరలించి దహన సంస్కారాలు పూర్తి చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండి హిందూ మతానికి చెందిన వృద్ధురాలు అంత్యక్రియలు జరిపిన మాము, షబ్బీర్, తలహా, ఖమ్ము, ఆరిఫ్ లను పలువురు అభినందించారు.
కాగా, ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత మూడు రోజులు వరుసగా 20వేలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో మాత్రం కరోనా కేసులు కాస్త తగ్గాయి. అయితే, కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య కాస్త పెరిగింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,00,424 నమూనాలను పరీక్షించగా.. 17,188 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.
తాజాగా నమోదైన 17,188 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,45,374కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 73 మంది మృతి చెందారు. విజయనగరం జిల్లాలో 11 మంది మృతి చెందగా, విశాఖపట్నంలో 10 మంది, తూర్పుగోదావరి 8, చిత్తూరు 7, కృష్ణా 6, కర్నూలు 5, ప్రకాశం 5, పశ్చిమగోదావరిలో 5, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున, అనంతపురం జిల్లాలో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 8519కి చేరింది.
Recommended Video
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 12,749 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 10,50,160కి చేరింది. కోలుకుంటున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారీగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల్లో అత్యధిక పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,86,695 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,71,60,870 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరులో 2260 కరోనా కేసులు నమోదు కాగా, అత్యల్పంగా ప్రకాశం 385 మంది కరోనా బారినపడ్డారు.