Mahanadu: నారా లోకేష్ 2.0: ఏం చేశారండీ..ఇంత తగ్గారు!
అమరావతి: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో దాదాపు గత రెండు నెలలు ప్రజలంతా తమ తమ ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. ఎవరికి ఇష్టమైన కార్యకలాపాలను వారు తమ ఇళ్లల్లోనే నిర్వహించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా కరోనా లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగిం చేసుకున్నారు.

స్లిమ్గా మారిన లోకేష్..
దాదాపు రెండు నెలల తర్వాత బయటికి వచ్చిన నారా లోకేష్ను చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారట. ఆయన ఈ రెండు నెలల్లోనే బాగా స్లిమ్గా తయారుకావడమే ఇందుకు కారణం. తెలుగుదేశం పార్టీ మహానాడు నేపథ్యంలో ఆయన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఎప్పుడూ భారీ బహిరంగ సభల ద్వారా నిర్వహించే మహానాడును.. కరోనా లాక్డౌన్ నిబంధనల నేపథ్యంలో ఈసారి డిజిటల్ మార్గాలను ఆశ్రయించింది టీడీపీ. వేలాది మంది ప్రతినిధులతో వెబినార్, జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీడీసీ ఈ సమావేశాలను నిర్వహిస్తోంది.

నారా లోకేశ్ 2.0..
కాగా, టీడీపీ కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ను చూసినవారంతా ‘నారా లోకేష్ 2.0' వచ్చేశారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేగాక, బొద్దుగా ఉండే నారా లోకేష్ ఇలా స్లిమ్గా ఎలా తయారయ్యారంటూ పలువురు ఆరాలు కూడా తీశారట.
లాక్డౌన్ సమయంలో చాలా మంది లావుగా అవుతుండగా మీరు మాత్రం ఇలా సన్నబడ్డారంటూ పలువురు అన్నారు. ఇక మీడియా వారు కూడా ఈ స్లిమ్ రహస్యంపై నారా లోకేష్ను ప్రశ్నించారు.

ఎలా తగ్గానంటే...
ఈ క్రమంలో స్పందించిన నారా లోకేష్.. లాక్ డౌన్ వల్ల తాము హైదరాబాద్ లో ఇరుక్కుపోయామని, డైట్ కంట్రోల్, వ్యాయామం వల్లే సన్నబడటం సాధ్యమైందని చెప్పుకొచ్చారు. మొత్తంగా 20 కిలోల బరువు తగ్గానని నారా లోకేష్ చెప్పారు.
ఎలాంటి డైట్ పాటించారు.. ఎలాంటి వర్కవుట్స్ చేశారని పలువురు మీడియా ప్రతినిధులతోపాటు నేతలు ఆరా తీశారు. కాగా, లాక్ డౌన్ కారణంగా లోకేష్ కేవలం వీడియో సమావేశాలకు పరిమితమైన విషయం తెలిసిందే. ఏదైనా విషయంపై సోషల్ మీడియా వేదికగానే స్పందిస్తున్నారు. రెండు నెలల తర్వాత ఆయనను చూడటంతో పార్టీ నేతలు, కార్యకర్తలు కొంత ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఏపీ సర్కారు అనుమతివ్వడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోపాటు లోకేష్ అమరావతికి వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications